మరో నటుడి మరదలితో అసభ్యంగా నటుడు, ఏపీ మంత్రి తెలుసంటూ..
వర్థమాన సినీ నటుడు తనతో అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ విజయవాడకు చెందిన యువతి (21) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: వర్థమాన సినీ నటుడు తనతో అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ విజయవాడకు చెందిన యువతి (21) జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయవాడకు చెందిన యువతి (21) తన సోదరుడు నరేంద్రతో కలిసి వెంకటగిరిలో నివాసం ఉంటున్న తన బంధువు, కమెడియన్ కమ్ సీరియల్ నటుడు డీవీ నాయుడు ఇంటికి వచ్చింది.
రాముతో నాయుడుకు ఆర్థిక లావాదేవీలు
కృష్ణా నగర్లో నివసించే సినీ నటుడు రాముతో డీవీ నాయుడుకు రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలున్నాయి. దాదాపు రూ.9.5 లక్షలు రాము తనకివ్వాలని డీకే నాయుడు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాము ఉన్న ఇంటికి డికె నాయుడు, తన మరదలు, మరిది నరేంద్రతో కలిసి వెళ్లాడు. రాము ఇంటి ఓనర్కు విషయం చెప్పాడు. ఇది మనసులో పెట్టుకున్న రాము మరొకరితో కలిసి మంగళవారం రాత్రి వెంకటగిరికి వచ్చాడు.
మరదలుతో కలిసి డబ్బు డ్రా చేసేందుకు..
ఆ సమయంలో డికె నాయుడు మరదలు, మరిది నరేంద్రతో పాటు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కిందకు దిగారు. ఇది గుర్తించిన రాము అతని స్నేహితుడు ఆ యువతిని అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. కులం పేరుతో దూషించారు. పక్కనే ఉన్న నరేంద్ర వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా అతన్ని కొట్టి నెట్టివేశారు. ఈ మేరకు యువతి, ఆమె సోదరుడు నరేంద్రలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రాథమికంగా ఫిర్యాదు..
రాముపై కేసు నమోదు చేయాలంటూ ఎమ్మార్పీఎస్, మహిళా మండలికి చెందిన కొందరు పోలీస్ స్టేషన్కు వచ్చారు. సీసీఫుటేజీ, ఆధారాలను సేకరిస్తున్నామని, అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా ఫిర్యాదును స్వీకరించి జీడీలో నమోదు చేసినట్లు తెలిపారు.
ఏపీ మంత్రి తెలుసునంటూ..
ఈ సందర్భంగా డీవీనాయుడు మాట్లాడారు. డబ్బులు ఇవ్వాల్సింది పోయి తమ కుటుంబ సభ్యులపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇదేమని అడిగితే తనకు ఏపీ మంత్రి కూడా తెలుసంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. విషయాన్ని ఫిలిం ఫెడరేషన్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు.