మంత్రగాన్ని నమ్మినందుకు... నిండు ప్రాణం బలి... భార్య ఆర్నెళ్ల గర్భవతి....
జబ్బు చేస్తే ఆస్పత్రికి బదులు బాబాలు,మంత్రగాళ్ల చుట్టూ తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల తరుచుగా వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే మంచిర్యాల జిల్లా కుందారం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఓ మంత్రగాడి చేతిలో బలైపోయిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా మరవకముందే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువకుడు కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగింది...
యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం వెలిగొండ గ్రామానికి చెందిన మహేష్ ఓ దినసరి కూలీ. ఏడు నెలల క్రితమే శివారని అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన ఐదారు నెలల పాటు బాగానే ఉన్నప్పటికీ... గత నెల రోజులుగా మహేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను... కొన్ని ఆస్పత్రుల్లో చూపించుకున్నా జబ్బు నయం కాలేదు. దీంతో తెలిసినవాళ్లు,బంధువులు నంది వనపర్తి అనే గ్రామానికి వెళ్లాలని సూచించారు. అక్కడ శ్రీహరి అనే మంత్రగాడు ఉంటాడని,ఎలాంటి జబ్బునైనా నయం చేస్తాడని చెప్పారు.
బంధువుల మాటలతో...
బంధువుల మాటలు నమ్మిన మహేష్ ఈ నెల 24న నంది వనపర్తికి వెళ్లి ఆ మంత్రగాడిని కలిసి తన ఆరోగ్య సమస్య గురించి వివరించాడు. దానికి తన వద్ద పరిష్కారం ఉందని చెప్పిన మంత్రగాడు రూ.20వేలు డిమాండ్ చేశాడు. దీంతో మహేష్ రూ.10వేలు అడ్వాన్సు చెల్లించి వచ్చాడు. అదే రోజు(అగస్టు 24) సాయంత్రం ఆ మంత్రగాడు మహేష్ ఇంటికి వచ్చాడు. ఇంట్లోనే కొన్ని పటాలు గీసి,ఏవేవో మంత్రాలు చదివాడు.
ఆమె ఆర్నెళ్ల గర్భవతి...
ఇక మహేష్ ఆరోగ్యం కుదుటపడుతుందని కంగారు పడాల్సిన పనిలేదని చెప్పి మిగతా రూ.10వేలు తీసుకుని వెళ్లాడు. కానీ అదే రోజు రాత్రి మహేష్ ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచాడు. దీంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించి ఆ మంత్రగాడిపై ఫిర్యాదు చేసింది. రోగం నయం చేస్తానని చెప్పి ప్రాణాలు బలితీసుకున్నాడని ఆరోపించింది. చెప్పుడు మాటలు విని మంత్రగాడి వద్దకు వెళ్లినందుకు భర్తను కోల్పోయానని విలపించింది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Recommended Video
మంచిర్యాల ఘటన మరవకముందే....
ఇటీవల మంచిర్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన రజిత (24) అనే బాలింతకు ఎవరో చేతబడి చేశారన్న కారణంతో కుటుంబ సభ్యులు,బంధువులు కలిసి ఓ భూత వైద్యుడిని ఇంటికి రప్పించారు. అతను భూత వైద్యం పేరుతో,దెయ్యాన్ని తరిమేస్తున్నానని చెప్పి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆపై కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా... అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. రజిత మృతితో నెల వయసు కూడా లేని ఆమె కొడుకు తల్లిని కోల్పోయినట్లయింది.