గర్భిణీ మృతి: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఖరీదు, మృతురాలి బంధువుల ఆందోళన...
అసలే ప్రభుత్వ ఆస్పత్రి.. ఇంకేముంది రోగులను పట్టించుకోరు. రోగులు అయితే కాస్త వెనక ముందో సర్దుకుంటారు.. కానీ గర్బిణీ విషయంలో కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. నొప్పులతో వచ్చిన మహిళను సరిగా పట్టించుకోలేదు.. దీంతో ఆ గర్బిణీ ఆసువులు బాసింది. వివాహిత మృతికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం మొరంగపల్లికి చెందిన మీనా గర్భవతి. నిండుచులాలు కావడంతో ఆమెకు నొప్పులు వచ్చాయి. వెంటనే మోమిన్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేసిన సిబ్బంది.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. భయపడిపోయిన వారు 108 వాహనంలో సదాశివపేట తరలించారు. కానీ అక్కడ కూడా వైద్యులు తమ చేతిలో ఏమీ లేదని.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించేలోపు.. గర్బిణి మృతిచెందారు.
గర్బిణి చనిపోవడంతో కుటుంబసభ్యుల, బంధువులు రోదనలు మిన్నంటాయి. మీనా మృతికి కారణం మోమిన్ పేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులే కారణం అని ఆరోపించారు. వారు వెంటనే స్పందిస్తే.. దారుణం జరిగి ఉండేది కాదన్నారు. మీనా మృతదేహాన్ని మోమిన్ పేట్ ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విషయం తెలుసుకొన్న సీఐ నగేశ్.. తమ సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులను నచ్చజెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మీనా చనిపోయిందని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని వారిని శాంతింపజేశారు.