గర్భిణీకి పరీక్ష పెట్టిన ఆస్పత్రులు .. రోడ్ పక్కనే బిడ్డ ప్రసవం
ఆసుపత్రిలో రక్త పరీక్ష అందుబాటులో లేకపోవడం, అందుకోసం మరో హాస్పిటల్కి వెళ్ళాల్సి రావటం ఓ నిండు గర్భిణీ నడిరోడ్ మీద డెలివరీ అయ్యేలా చేసింది .ఓ నిరుపేద మహిళ నడిరోడ్డుపై ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన ఎల్బీనగర్లో చోటుచేసుకుంది.
రోడ్ పై మహిళ ప్రసవం .. హృదయ విదారక దృశ్యం
సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన రాంబాబు, మేరమ్మకూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ వద్ద రేకుల పని చేసుకునే ఈ దంపతులు ఆస్పత్రిలో అన్ని వసతులు లేకపోవటంతో నానా ఇబ్బందులు పడ్డారు. అసలు విషయానికి వస్తే రాంబాబు భార్య మేరమ్మ రెండోసారి గర్భం దాల్చటంతో ప్రతినెలా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటోంది.
రక్త పరీక్షలు లేక నిండు చూలాలిని ఇబ్బందులు పెట్టిన వైద్యులు
అక్కడ రక్త పరీక్షల సౌకర్యం లేకపోవడంతో నిండు చూలాలైన మేరమ్మను డాక్టర్లు వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లమని సూచించారు. ఇక అక్కడ కొన్ని పరీక్షలు చేసి మరి కొన్ని పరీక్షలు బయట చేయించమని చెప్పారు .భర్త రాంబాబు స్నేహితుల వద్ద రూ.3వేలు అప్పుగా తీసుకుని అన్ని పరీక్షలు చేయించి ఆస్పత్రికి వెళ్ళగా , మరికొన్ని పరీక్షలు అవసరం అని చెప్పారు. దీతో రాంబాబు చేసేది లేక తన వద్ద డబ్బు లేదని నిండు గర్భిణీ అయిన భార్యను తీసుకుని గాంధీ ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి . దీంతో బస్ దిగిన ఆమెను ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్లాలని భావించాడు భర్త రాంబాబు .
ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్ళేలోపే ప్రసవం
భర్త ఆటోను తీసుకొచ్చే లోపే మేరమ్మ బిడ్డకు జన్మనిచ్చింది . దీంతో స్థానికులు 108కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించారు. 108 సిబ్బంది ఆమెను వెంటనే వనస్థలిపురం ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు చెప్పారు.
ఆస్పత్రుల్లో వసతుల లేమితోనే మహిళ రోడ్ పై బిడ్డకు జననం ఘటన
ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు అవకాశం లేక ఆ నిండు గర్భిణీ చాలా అవస్థ పడింది. కనీసం రక్తపరీక్షలు కూడా లేని ఆస్పత్రులు మన వైద్య శాఖ పనితీరుకు అద్దంపడుతున్నాయి . తాజాగా జరిగిన ఈ సంఘటన తెలంగాణా రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కనీస రక్తపరీక్షకు సంబంధించిన వసతులు కూడా లేవని అర్ధం అవుతుంది. మన ఆస్పత్రుల యధార్ధ స్థితికి అద్దం పడుతుంది.