అరుదు: ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు (ఫోటోలు)
హైదరాబాద్: యశోద ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ శిశువులు అందరూ క్షేమంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు తునికి చెందిన చంద్రశేఖర్ (35) సతీమణి నళిని (33) గర్భవతి. మొదట తునిలోని స్థానిక వైద్యులను సంప్రదించింది.
ఆ సమయంలో ఆమె కడుపులో నలుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక్కడి కంటే కూడా హైదరాబాద్లో చేర్పిస్తే బాగుంటుందని వైద్యులు సూచించడంతో, మెరుగైన చికిత్స కోసం నళినిని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిని సంప్రదించారు.
నగరంలోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్న నళినికి శుక్రవారం రాత్రి రక్తస్రావం కావడంతో బంధువులు యశోద ఆసుపత్రిలో చేర్పించారు. యశోద ఆసుపత్రి వైద్యులు భాగ్యలక్ష్మి, మాధవి సహా 15 మంది బృందం 32 వారాల గర్భిణికి శస్త్రచికిత్స చేసి శిశువులను బయటికి తీశారు.
ఆనంతరం వైద్యులు మాట్లాడుతూ ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు జన్మించడం చాలా అరుదని, ప్రతి ఏడు లక్షల ప్రసవాల్లో ఒకరికే ఈ అవకాశం ఉందని తెలిపారు. ఒక్కో శిశువు 1.2 కేజీల బరువు ఉందని, ప్రస్తుతం వారిని నియోనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
కాగా, తొలి కాన్పులోనే నలుగురు ఆడశిశువులు జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు నళిని భర్త చంద్రశేఖర్ చెప్పారు.