పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐలకు టోకరా.. లక్షలు దోచుకున్న కి'లేడీ'..!
హైదరాబాద్ : ఎంబీఏ చదివింది. లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంది. అందుకు సులువుగా డబ్బు సంపాదించే మార్గం కనిపెట్టింది. మ్యాట్రిమోనీ సైట్లలో ఫేక్ ప్రొఫైల్తో ఎన్నారైలకు వల వేసింది. వారి నుంచి లక్షలు దండుకుని ముఖం చాటేసింది. గతంలో జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోని అర్చన మళ్లీ అలాంటి మోసాలు మొదలుపెట్టింది. బాధితుల ఫిర్యాదుతో కటకటాలు లెక్కబెడుతోంది.
రోజా ఫ్యాన్సా మజాకా..! అసెంబ్లీ దగ్గర సెల్ఫీలతో హల్ చల్ ! దారి లేక వెయిట్ చేసిన బాలయ్య
విలాస జీవితానికి అలవాటు
నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన అర్చన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. 2016లో నెల్లూరుకే చెందిన లెక్చర్ కొరం దుర్గా ప్రవీణ్తో ఆమెకు పెళ్లైంది. అయితే అప్పటికే విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన అర్చన సులువుగా డబ్బులు సంపాదించేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పుష్తయ్ పేరుతో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి రిజిస్టర్ చేసుకుంది. కేవలం ఎన్నారై సంబంధాలు మాత్రమే చేసుకుంటానని వెబ్సైట్లో స్పష్టం చేసింది.
ఫేక్ ప్రొఫైల్తో ఎన్నారైలకు వల
మ్యాట్రిమోనీ సైట్లలో అర్చన ప్రొఫైల్ చూసి నచ్చిన ఎన్నారై వరుల తల్లిదండ్రులు ఆమె ఇచ్చిన నంబర్కు కాల్ చేసేవారు. వాయిస్ యాప్తో పలు రకాల వాయిస్లతో మాట్లాడిన ఆ కిలేజీ వరుడితో పాటు అతని తల్లిదండ్రులను బుట్టలో వేసుకునేది. కొన్నాళ్లు వారితో మాట్లాడిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని చెప్పేది. ఆ తర్వాత వివాహ ఖర్చుల కోసం అంటూ వారి నుంచి లక్షల రూపాయలు దండుకునేది. అకౌంట్లో అమౌంట్ పడగానే సిమ్ మార్చేసేది.
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి
అమెరికాలో ఉంటున్న సింహాద్రి పవన్ కుమార్ అనే యువకుడిని సైతం అర్చన ఇదే రీతిలో మోసం చేసింది. భారత్ మ్యాట్రిమోనీ ద్వారా ఫుష్తయ్ పేరుతో పరిచయం చేసుకున్న ఆమె.. వెస్ట్ పామ్ బీచ్లోని సిస్కోలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పింది. తాను ఇల్లు మారేందుకు రూ.4లక్షలు అవసరమని చెప్పడంతో పన్ ఆమె బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసిన అర్చన లిఫ్ట్ చేయకపోవడం, కొన్నాళ్లకు సిమ్ మార్చేయడంతో పవన్ తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ విషాన్ని తన కజిన్ కొత్తపేటకు చెందిన మధుమోహన్ దృష్టికి తెచ్చాడు. దీంతో ఈ నెల 12న మధుమోహన్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలోనూ మోసాలకు పాల్పడిన అర్చన
అర్చన ఇలాంటి మోసాలకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. ఇటీవల మ్యాట్రిమోనీ మోసాలకు పాల్పడిన ఫిర్యాదుపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం ఆమె బెయిల్పై బయటకు రాగానే రాచకొండ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. గతంలోనూ ఇలాంటి కేసుల్లో నిందితురాలైన అర్చన చంచల్గూడ జైలులో శిక్ష అనుభవించింది. 2018 డిసెంబర్లో ఓ అడ్వకేట్ సాయంతో బయటకు వచ్చింది.