కామారెడ్డిలో దారుణం... మహిళా ఉద్యోగినిపై దాడి... మున్సిపల్ ఆఫీస్లో రచ్చ రచ్చ...
కామారెడ్డిలో దారుణం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న రోజా అనే మహిళా కాంట్రాక్టు ఉద్యోగినిపై దాడి జరిగింది. బోధన్ మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దాడిలో రోజా ముక్కుకు తీవ్ర గాయమై రక్తస్రావమైనట్లు తెలుస్తోంది.
సోమవారం(సెప్టెంబర్ 21) ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చిన విధులు నిర్వర్తిస్తున్న రోజాపై రామకృష్ణ అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. బోధన్లో పనిచేసే అతను కామారెడ్డిలో రోజా పనిచేసే కార్యాలయానికి వచ్చి మరీ దాడికి పాల్పడటం కలకలం రేపింది. దాడి సమయంలో కార్యాలయంలోని ఫర్నీచర్,ఫైల్స్ను కూడా విసిరేసినట్లు సమాచారం. సహచర ఉద్యోగులు వారించడంతో చివరకు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
అనంతరం సహచర ఉద్యోగులు ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దాడిపై బాధితురాలు రోజా మాట్లాడుతూ... రామకృష్ణ గతంలో కామారెడ్డి కార్యాలయంలోనే జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేవాడని చెప్పారు. ఆ సమయంలో అతని కిందే పనిచేసేదాన్ని అని... ఒకే ఆఫీస్ కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడేదాన్ని అని చెప్పారు. ఆ తర్వాత బోధన్కు బదిలీ అయ్యాడని... అప్పటినుంచి తనకు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని చెప్పింది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని ఆఫీస్కు వచ్చి దాడి చేశాడని పేర్కొంది.
రామకృష్ణపై బాధితురాలు రోజా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రోజాకు,రామకృష్ణకు మధ్య గతంలో ఏమైనా గొడవలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి ఫోన్ కాల్స్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు రామకృష్ణ తీరుపై మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు,మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.