వీఆర్ఏను చెప్పుతో కొట్టిన మహిళా రైతు.. కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలే ఆదర్శమా..! (వీడియో)
ఆదిలాబాద్ : లంచం అడిగితే ఎవరైనా సరే చెప్పుతో కొట్టాలంటూ సెలవిచ్చారు సీఎం కేసీఆర్. చాలా సందర్భాల్లో ఆయన ఈ విషయం పదేపదే ప్రస్తావించారు. మీ హక్కులు మీరు పొందడానికి లంచం ఎందుకు ఇవ్వాలంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న క్రమంలో ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలని.. లంచం ఎవరైనా అడిగితే వారికి చెప్పుతో సమాధానం చెప్పాలని సూచించారు.
ఇక సీఎం కేసీఆర్ తనయుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. ఆయన మరో అడుగు ముందుకేసి తమ పార్టీ నేతలు లంచమడిగినా అదే పని చేయండని ప్రజలకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ పథకంలో లంచాలు అడుగుతున్నారనే విషయం ఆయన దృష్టికి వచ్చి ఆ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళారులను ప్రోత్సహించబోదని పలుమార్లు గుర్తుచేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పిన కేటీఆర్ బ్రోకర్లను అస్సలు నమ్మొద్దన్నారు.
రాజగోపాల్ రెడ్డి మర్మమేంటి.. భవిష్యత్ సీఎంగా చెప్పుకోవడానికి రీజన్ ఇదేనా!.. బీజేపీ ఎంట్రీ కన్ఫామేనా?
కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ కొమురం భీం జిల్లాలో ఓ మహిళా రైతు ప్రభుత్వ అధికారి చెంప ఛెళ్లుమనిపించారు. రెబ్బెన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిష్టాపూర్ గ్రామానికి చెందిన వీఆర్ఏ దానయ్యపై అదే గ్రామానికి చెందిన మహిళా రైతు చెప్పుతో దాడి చేశారు. తమ భూ సమస్య పరిష్కరించడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. చెప్పులు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యల సారం ప్రజల్లో చైతన్యం తెచ్చిందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బంగారు తెలంగాణ సాధనలో మీ హక్కులు మీరు పొందండంటూ వారు నింపిన స్ఫూర్తితోనే జనాలు చైతన్యవంతులు అవుతున్నారేమో అనే వాదనలు లేకపోలేదు.