ప్రాణం తీసిన నాలా.... మరొకరు బలి... వాకింగ్కి వెళ్లి గల్లంతైన వృద్దురాలు...
హైదరాబాద్ సరూర్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కి వెళ్లిన సరోజ అనే వృద్దురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయింది. గమనించిన స్థానికులు స్థానిక ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారులు,పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చైతన్యపురి పరిధిలోని హనుమాన్ నగర్ నాలాలో వృద్దురాలి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మృతదేహం సరూర్ నగర్ నాలా నుంచి సుమారు 1 కి.మీ మేర కొట్టుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే స్పందించకపోయి ఉంటే... మృతదేహం మూసీలోకి కొట్టుకొళ్లేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వృద్దురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిందా.. లేక మరేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్దురాలి మృతితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది.
గతంలోనూ నగరంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో నేరేడ్మెట్లో సుమేధ అనే బాలిక(12) ఓపెన్ నాలాలో పడి మృతి చెందింది. సైకిల్పై ఇంటి నుంచి బయటకెళ్లిన చిన్నారి.. రోడ్డుపై భారీ వర్షపు నీరు ఉండటంతో అదుపు తప్పి పడిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాలాలో పడి గల్లంతైంది. భారీ వర్షానికి నాలా ఉధృతంగా మారడంతో సుమేధ అందులో కొట్టుకుపోయింది.