కాళ్లు నరికేసి హత్య: కడియాల కోసమేనా?, మృతురాలు లక్ష్మీనర్సమ్మగా గుర్తింపు
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి(మెంటల్ హాస్పిటల్) ఆవరణలో దారుణ హత్యకు గురైన మహిళ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగుల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన మహిళను తిలక్నగర్కు చెందిన లక్ష్మీనర్సమ్మ(58)గా గుర్తించారు.
కడియాల కోసమే..
రహమత్నగర్ కల్లు కాంపౌండ్కు కల్లు తాగేందుకు వచ్చిన ఆమెను ఇద్దరు వ్యక్తులు అపహరించి కాళ్లకున్న వెండి కడియాలు తీసుకొని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
కాళ్లు నరికేశారు: ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో మహిళ దారుణ హత్య, భద్రత ప్రశ్నార్థకం
కల్లు తాగేందుకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిలక్నగర్లో పెద్ద కుమార్తె వద్ద లక్ష్మీనర్సమ్మ ఉంటోంది. రహమత్నగర్లో ఉంటున్న చిన్న కుమార్తె కృష్ణవేణికి ప్రసవ సమయం దగ్గరపడటంతో పది రోజుల కిందట వారింటికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం కల్లు తాగుతానని చెప్పడంతో అల్లుడు ఆనంద్కుమార్ ద్విచక్ర వాహనంపై ఆమెను రహమత్నగర్లోని కల్లు కాంపౌండ్ వద్ద దిగబెట్టాడు.
మీడియాలో రావడంతో
ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. హత్యకు గురైన లక్ష్మీనర్సమ్మ చిత్రాలు పత్రికల్లో రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు.
బైక్పై తీసుకెళ్లి దారుణం
కల్లు తాగిన తరువాత ఆమెను ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు తేలింది. కల్లు కాంపౌండ్ నుంచి ఎర్రగడ్డ వరకు రహదారిలో గల సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. మార్గం మధ్యలో ఆమెను ఇద్దరు వ్యక్తులు బండిపై కూర్చోబెట్టుకొని వెళుతుండడాన్ని గుర్తించారు. లక్ష్మీనర్సమ్మ కాళ్లకు వెండి కడియాల కోసం హత్య చేసి, కాళ్లు నరికి ఉంటారని ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.