దారుణం: పెళ్లి నిశ్చయయమైన యువతిపై గ్యాంగ్ రేప్
షాపింగ్ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరిన యువతిపై ఆటో డ్రైవర్ సహా మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.
మల్యాల: పెళ్లి నిశ్చయమైన ఓ యువతిపై కొంతమంది దుర్మార్గులు అత్యాచారానికి తెగబడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా.. యువతి అత్యాచారానికి గురవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
జగిత్యాల ఎస్పీ అనంత శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలం రాంపూర్కు చెందిన 21 ఏళ్ల యువతికి ఈ నెల 21న వివాహం నిశ్చయమైంది. కుటుంబమంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇదే క్రమంలో పెళ్లిలో ధరించాల్సిన గాజులు, మెహందీ వంటి కొన్ని అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు తల్లి కూతుళ్లు జగిత్యాలకు వెళ్లారు.
అయితే చెరో పని మీద వెళ్లడంతో.. తల్లి కొత్త బస్టాండ్ సమీపంలో వాహనం దిగింది. యువతి పాత బస్టాండ్ వరకు వెళ్లి తన స్నేహితురాళ్లకు పెళ్లి శుభలేఖలు అందజేసింది. అనంతరం షాపింగ్ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఆటోలో ఎక్కిన మరో ఇద్దరు వ్యక్తులు మత్తు ద్వారా యువతి స్పృహ కోల్పోయేలా చేశారు.
అనంతరం ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలు కాజేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రాత్రి సమయంలో కొండగట్టు వద్ద వదిలి పారిపోయారు. శుక్రవారం నాడు స్పృహలోకి వచ్చిన యువతి.. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిపై కిడ్నాప్, దొంగతనం, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.