షాక్: పోస్ట్మార్టానికి తీసుకెళ్తుంటే కూర్చున్న యువతి, బస్సులో మహిళ ప్రసవం
హైదరాబాద్: చనిపోయిందనుకున్న యువతి.. పోస్టుమార్టానికి తరలించే సమయంలో లేచి కూర్చుంది. దీంతో అవాక్కవడం అందరి వంతయింది. వెంటనే ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పలపాడు గ్రామానికి చెందిన కనకదుర్గా (22) అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో కనకదుర్గను ఆమె భర్త విడిచిపెట్టాడు. దీంతో, ఆమె మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది.
కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని ప్రగతి స్కూల్ వెనకాల ఉంటోంది. అక్కడే టైలరింగ్ పనులు చేసుకుంటోంది. ఆమె గురువారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఇంట్లోకెళ్లి గడేసుకుని నిద్రపోయింది.
రాత్రి అవుతున్నా బయటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టే ప్రయత్నం చేశారు. లోపలి నుంచి స్పందన రాకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై పవన్ తన సిబ్బందితో కలిసొచ్చి తలుపుతట్టాడు. ఆమెలో స్పందన లేదు.
ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. శుక్రవారం ఉదయం వరకు వారు కూడా స్పందించకపోవడంతో మరోసారి పోలీసులు కనదుర్గ నివాసముంటున్న ఇంటికి చేరుకున్నారు. స్పందించక పోవడంతో... తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు.
కనకదుర్గ బెడ్పై పడి ఉండడంతో మరణించి ఉంటుందని భావించి గాంధీ వైద్యశాలకు తరలించేందుకు ఓ ఆటో ట్రాలీని తెప్పించారు. అనంతరం ఆమెను ఓ దుప్పట్లో చుట్టి ఆటోలోకి తరలిస్తుండగా కళ్లు కదులుతున్నట్లు ఎస్సై గుర్తించారు. దీంతో, అతను ముఖంపై నీళ్లు చల్లగా ఆమె లేచి కూర్చుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఆర్టీసీ బస్సులో బిడ్డకు జన్మనిచ్చింది
24 ఏళ్ల ఓ మహిళ ఆర్టీసీ బస్సులోనే శుక్రవారం నాడు ప్రసవించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కోఠి వద్ద జరిగింది. ఐడీఏ బొల్లారంకు చెందిన గర్భిణిని ప్రసవం కోసం కోఠిలోని ఆసుపత్రికి సిటీ బస్సులో తీసుకువస్తున్నారు.
కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ వద్దకు రాగానే ఆమెకు పురుటి నొప్పులు ఎక్కువై బస్సులోనే ప్రసవించింది. బస్సులో ఉన్న తోటి మహిళలు ఈ సందర్భంగా సహకరించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అనంతరం, వీరిని కోఠిలోని ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బస్సులోనే ప్రసవించిన మహిళ పేరు లక్ష్మి. ఆమెకు వైద్యులు అక్టోబర్ 21వ డేట్ ఇచ్చారు. కానీ శుక్రవారం ఉదయం నొప్పులు వచ్చాయి. ఆమె ఆరు గంటల సమయంలో మియాపూర్లో బస్సు ఎక్కింది.
అప్పటికే ఆమె నొప్పులతో బాధపడుతోంది. ఇది గుర్తించిన కండక్టర్.. డ్రైవర్కు చెప్పాడు. దీంతో, పలు బస్సు స్టాపులలో ఆపకుండానే ఆసుపత్రికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే, కోఠీ ఆసుపత్రికి దగ్గరగా వచ్చిన సమయంలో ఆమె బస్సులోనే ప్రసవించింది.