బురిడీ కొట్టించాలనుకున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు..
హైదరాబాద్ : అధిక రాబడి ఆశ చూపించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి ఆపై ప్లేటు ఫిరాయించిన ఘటన సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో చోటు చేసుకుంది. చిలకలగూడకు చెందిన ఓ జంట తమవద్ద పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తామంటూ నమ్మించడంతో.. మాయ మాటలు నమ్మిన కొంతమంది బాధితులు డబ్బులు చెల్లించి మోసపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. లలిత-శ్రీవాస్తవ్ అనే దంపతులు శ్రీనివాస్ ఖాదికర్, టి.రాకేష్, మరియు రియల్ హీరో మ్యాగజైన్ రిపోర్టర్ సాయిబాబుతో కలిసి ఈ దందాకు తెరలేపారు. లలిత శ్రీవాస్తవ్ ఇద్దరూ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించి ఆ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారంలో పెట్టుబడిగా పెడుతున్నామని, తద్వారా భారీ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మబలికారు.
నిందితుల మాటలు నమ్మిన బాధితులు కోటి రూపాయల వరకు డబ్బును ముట్టజెప్పారు. ఇదే క్రమంలో బాధితుల నుంచి తీసుకున్న రూ.70 లక్షలను లలిత రాకేష్ అనే వ్యక్తి ద్వారా బిల్డింగ్ మరియు బంగారం రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సునీల్ కి ముట్టజెప్పింది. మిగతా డబ్బును తమ విలాసాల కోసం వాడుకున్నారు.
అయితే లలిత ఇచ్చిన డబ్బును సునీల్ పెట్టుబడి పెట్టకపోగా, తిరిగి ఇవ్వకపోవడంతో.. డబ్బు కోసం సునీల్ పై ఆమె ఒత్తిడి తెస్తూ వస్తోంది. దీంతో రూ.55 లక్షలను చెక్ రూపంలో లలితకు అందజేశాడు సునీల్. ఇక మొత్తం వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిబాబు అనే మరో వ్యక్తి ఈ మొత్తం గోల్ మాల్ వ్యవహారం పోలీసుల ద్రుష్టికి వెళ్లకుండా బయటపడేస్తానని నమ్మించి లలిత శ్రీవాస్తవ్ వద్ద నుంచి రూ.2.75 లక్షలు తీసుకున్నాడు.
తనకు పోలీసుల్లో చాలా పరిచయాలు ఉన్నాయని లలిత శ్రీవాస్తవ్ లను నమ్మించిన సాయిబాబు డబ్బు తీసుకున్నాక.. తనను కొంతమంది డబ్బు కోసం వేధిస్తున్నారంటూ చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం సాయిబాబు సూచన మేరకు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన లలిత పోలీసులు తమను వేధిస్తున్నారంటూ పిటిషన్ వేసింది.
ఇదే సమయంలో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించడంతో, లలిత శ్రీవాస్తవ్ ఇంటిపై దాడులు నిర్వహించారు పోలీసులు. దాడుల్లో భాగంగా రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా, ఈ జంట గతంలోను పలు కేసుల్లో రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినట్టుగా పోలీసులు తెలపడం గమనార్హం.