చెంపపై కొట్టి, వీడియో ధ్వంసం: పీఎస్లో స్త్రీ వీరంగం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ గురువారం వీరంగం సృష్టించింది. అడ్డుకోబోయిన మహిళా హెడ్ కానిస్టేబుల్పై చెంపదెబ్బ కొట్టింది. ఈ దృశ్యాన్ని వీడియో తీస్తున్న మరో కానిస్టేబుల్ నుండి కెమెరా లాక్కొని ధ్వంసం చేసింది. సీఐ పైన తిట్లపురాణం అందుకుంది.
ధర్మపురికి చెందిన గౌసియా కుమారులు అర్హత లేకున్నప్పటికీ ఆర్టీసీ బస్పాస్లు పొందారని పేర్కొంటూ 2013 జూలైలో ఆర్టీసీ కంట్రోలర్ లక్ష్మినర్సయ్య వారి బస్పాస్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమె కంట్రోలర్ లక్ష్మినర్సయ్యపై దాడికి పాల్పడడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.
దీంతో కంట్రోలర్తో పాటు మరో ఇద్దరు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని కోర్టు ద్వారా ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపగా గౌసియా తప్పుడు ఫిర్యాదు చేసిందని రుజువుకావడంతో కేసును ఉపసంహరించారు.
అయితే, తాను పెట్టిన కేసు ఎలా క్లోజ్ చేశారంటూ గత రెండేళ్ల నుండి తరచూ జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్కు వస్తూ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించిందని తెలుస్తోంది. గురువారం సైతం పోలీస్ స్టేషన్లో సీఐని అసభ్యపదజాలంతో దూషిస్తుండగా అలా తిట్టవద్దని పేర్కొన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ దాడి చేసి, చెంపపై కొట్టింది. ఆమె సృష్టిస్తున్న హల్చల్ను వీడియో తీసే మధు అనే కానిస్టేబుల్ చేతిలోని కెమెరా లాక్కొని ధ్వంసం చేసింది.