పబ్లో ఓ యువతిని కిడ్నాప్, బ్లేడ్లతో దాడి చేసిన మరో యువతి, యువకుడు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పబ్లో ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఆమెపై బ్లేడ్లతో దాడి చేశారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమెను కిడ్నాప్ చేసింది ఓ యువతి, యువకుడే కావడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన సమీరా అనే యువతి ఆరు నెలల క్రితం దుబాయ్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్తో కొద్ది రోజుల క్రితం గొడవలు అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫిరోజ్ తన గర్ల్ ఫ్రెండ్ కీర్తితో కలిసి మూడు రోజుల కిందట ఓ పబ్లో సమీరపై దాడి చేశారు.
మద్యం మత్తులో ఉన్న సమీరాపై బ్లేడ్లతో దాడి చేసి, కారులో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కీర్తి నివాసంలోని బాత్రూంలో తనను బంధించి, ఒంటిపై దుస్తులు తీసేసి.. బ్లేడ్లతో దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వారి బారి నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేశానని తెలిపింది. తన నుంచి నగదు, నగలను కూడా దోచుకున్నారని తెలిపింది.
కాగా, ఫిరోజ్, కీర్తిల దాడిలో సమీరాకు చేతులపై తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవం ఎంత వరకు ఉందనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు.