వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య, లవర్తో పరారీ
హైదరాబాద్: ప్రియుడి మోజులో మరో భార్య... తన భర్తను హత్య చేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని నాచారం పరిధిలో చోటు చేసుకుంది. భర్త హత్యపై కేసు దర్యాఫ్తు చేసిన పోలీసులు రెండు నెలల పాటు గాలించి, నిందితులను పట్టుకున్నారు.
భర్త హత్యలో భార్య, ఆమె ప్రియుడి పాత్ర ఉందని దర్యాఫ్తులో తేల్చారు. భర్తను చంపేసిన తర్వాత ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. గాలించి అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పెద్దఇడిగి గ్రామానికి చెందిన వీరయ్య, కర్ణాటక బీదర్కు చెందిన భాగ్యశ్రీలు భార్యాభర్తలు.
యూపీ వ్యక్తితో వివాహేతర సంబంధం
భర్త వీరయ్య డీసీఎం డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య భాగ్యశ్రీ నాచారంలోని ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోంది. వీరు మల్లాపూర్ నాగలక్ష్మినగర్లో ఉంటున్నారు. భాగ్యశ్రీ పని చేస్తున్న కంపెనీలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మధురకు చెందిన ముఖేష్ రానా(28) పని చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
చంపేయాలని ప్లాన్
ఈ విషయం భర్త వీరయ్యకు తెలిసింది. భార్యను పలుమార్లు మందలించాడు. కానీ ఆమె వినలేదు. తీరు మార్చుకోలేదు. ఈ విషయమై భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భర్తను ఎలాగైనా చంపేయాలని భార్య నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది. అతనితో కలిసి ప్లాన్ వేసింది.
ప్రియుడికి ఫోన్
ఈ ఏడాది అక్టోబరు 10వ తేదీన రాత్రి వీరయ్య మద్యం తాగి భార్యతో ఘర్షణ పడ్డాడు. భార్య భాగ్యశ్రీ తన ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అనంతరం ప్లాన్ ప్రకారం రోకలి బండతో భర్త తలపై కొట్టింది. అతనిని చంపేసింది. ఆ తర్వాత ప్రియుడితో పరారయ్యింది. కొద్ది రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
భార్య, ప్రియుడి అరెస్ట్
పోలీసులు తలుపులు తీసి చూడగా మృతదేహం కుళ్లిపోయి ఉంది. పక్కనే రోకలి బండ, రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో హత్య చేసినట్లు అనుమానించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా భార్యే హత్య చేసినట్లు నిర్ధారించారు. భార్య, ప్రియుడు కూడా మల్లాపూర్లోనే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అరెస్టు చేసి విచారించారు. వారిని రిమాండుకు తరలించారు.