స్నేహం-ఉన్మాదం: ప్రేమించలేదని నిశ్చితార్థానికి ముందు రోజు చంపేశాడు
యువతి తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువకుడు ఆమెను శనివారం సాయంత్రం దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. హత్య అనంతరం అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
యాదగిరిగుట్ట: యువతి తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువకుడు ఆమెను శనివారం సాయంత్రం దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. హత్య అనంతరం అతను పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో తోటమాలిగా పని చేస్తున్న యాదగిరిపల్లికి చెందిన సాయిలు కుమార్తె గాయత్రి (20), అదే ప్రాంతంలోని గోరుకంటి శ్రీకాంత్(24) చిన్ననాటి స్నేహితులు. భువనగిరిలో డిగ్రీ చదువుతున్న ఆమెను శ్రీకాంత్ గత కొంతకాలంగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించింది.
వేరే సంబంధం చూశారని ఉన్మాదం
ఇంతలో తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. గాయత్రి అంగీకరించడంతో ఆదివారం నిశ్చితార్థం చేయాలనుకున్నారు. పెళ్లైతే గాయత్రి తనకు దక్కదని శ్రీకాంత్ ఆగ్రహం పెంచుకున్నాడు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు గాయత్రి ఇంటికి వచ్చాడు. టీవీ చూస్తున్న గాయత్రిని కత్తితో పొడిచాడు. ఆమె సోదరుడు రామకృష్ణ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిని నెట్టేసి మరో మూడుసార్లు గాయత్రిని పొడిచి పారిపోయాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
చురుగ్గా ఉండే గాయత్రి..
తీవ్రంగా గాయపడిన గాయత్రిని ఇంట్లోని వారు, చుట్టుపక్కలవారు భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బాగా చదువుతూ ఎప్పుడూ చురుకుగా ఉండే కన్నబిడ్డ తమ కండ్లముందే విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు సాయిలు, లక్ష్మి భోరున విలపించారు.
విషాదఛాయలు
యాదగిరిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సాయిలు ఇంటికి చేరుకున్నారు. నిందితుడు అదే ఊరి వాడు కావడంతో ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని గాయత్రి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. పెద్దల సమక్షంలో గతంలో ఆయనను మందలించారని, మారిపోయాడనుకున్నామని కంటతడి పెట్టారు.
పెద్దల సమక్షంలో మందలించినా...
శ్రీకాంత్ రాయగిరిలో ఓ ప్రయివేటు ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని అతను వేధిస్తుండటంతో గాయత్రి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పిలిచి మందలించారు. మళ్లీ యువతి జోలికి రావొద్దని పెద్దలు చెప్పారు. కానీ ఉన్నాదంతో రెచ్చిపోయి, హత్య చేశాడు.