రెండో పెళ్లి: డ్రైవర్కు సుఫారీ ఇచ్చి భర్త హత్య కేసులో ట్విస్ట్లు, అక్కడే డౌట్
హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త కేస్యను డ్డ్రైవర్ సహాయంతో చంపిన భార్య పద్మ కేసులో పలు ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. డ్రైవర్కు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పి, అతని సహకారంతో గొంతు నులిమి చంపి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసింది. కానీ పోలీసుల విచారణలో దొరికింది.
భార్య పద్మను కాదని భర్త కేస్య నాయక్ మరో పెళ్లి చేసుకోగా, ఆ భర్తనే చంపేస్తే ఇన్సురెన్స్ డబ్బు తనకు వస్తుందని భార్య అతనిని హత్య చేసింది. ఆ డబ్బులు రాకపోగా ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. కమ్మగూడకు చెందిన కేస్యా నాయక్ (43) మెదక్ తపాలా విభాగంలో గ్రేడ్ 1 ఉద్యోగి. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం, బొర్రపాలెం సూత్యతండాకు చెందిన పద్మ (32)తో పెళ్లయింది.
రెండో పెళ్లి చేసుకున్న భర్త
కేస్య, పద్మలకు సంతానం లేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగేవి. పెద్దలు వారి వివాదాన్ని పరిష్కరించారు. ఆ తర్వాత వారికి కూతురు పుట్టింది. ఆ సమయంలో కేస్య మరో పెళ్లి చేసుకున్నాడు. తనను వేధిస్తూ భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య పద్మ ఎనిమిదేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి భార్యభర్తలు విడిగా ఉంటున్నారు. నాటి కేసు విషయమై కేస్య నల్గొండ కోర్టుకు వచ్చేవాడు.
డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకొని
కేస్య 3 నెలల క్రితం ఒక కారును కొని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నందివనపర్తి గ్రామ తండాకు చెందిన వినోద్కు అద్దెకు ఇచ్చాడు. అవసరమున్నప్పుడు కారును తెప్పించుకునేవాడు. భార్య పద్మ రెండు నెలల క్రితం... తన భర్తను కోర్టుకు వచ్చిన డ్రైవర్ ఫోన్ నెంబరు తీసుకుంది. డ్రైవర్కు ఫోన్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, భర్త చనిపోతే ఇన్సురెన్స్ డబ్బు రూ.50 లక్షలు తనకు వస్తాయని చెప్పింది. యజమానిని చంపేందుకు రూ.10 లక్షలు కావాలని చెప్పాడు. దానికి ఆమె అంగీకరించింది. ఇన్సురెన్స్ డబ్బు రాగానే ఇస్తానని చెప్పింది.
ఇలా చంపేశాడు
ఆగస్ట్ 27న ముందస్తుగా మిర్యాలగూడ బస్టాండ్ వద్ద రూ.15 వేలు ఇచ్చింది. ఆగస్ట్ 31న కేస్యానాయక్ను వినోద్ కారులో ఎక్కించుకుని సాగర్ రోడ్డు గుర్రంగూడ సమీపంలోని భవాని బార్కు తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న కేస్యాను కారులో కూర్చోబెట్టి దాదాపు కిలో మీటర్ దూరం తీసుకు వెళ్లాడు. అక్కడ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం కారును వేగంగా నడిపి ఇంజాపూర్ సమీపంలోని ఓ విద్యుత్తు స్తంభానికి ఢీకొట్టాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి కేస్యా చనిపోయాడని చెప్పారు. ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
అక్కడే పోలీసులకు అనుమానం
కేస్యా శరీరంపై రక్తపు మరకలు లేకపోవడం, గాయాలు కాకపోవడం, అతని మెడపై నల్లటి గాటు ఉండటంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో డ్రైవర్ వినోద్ అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు పద్మను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా, తాను చంపించినట్లు తెలిపింది. వారిని అఱెస్టు చేసి రిమాండుకు పంపించారు.