ట్విస్ట్లెన్నో: అక్కడా తడబడిన రాజేష్, ప్రియుడి కోసం ఎంతైనా పర్లేదన్న స్వాతి డ్రామాలెన్నో
Recommended Video
హైదరాబాద్/నాగర్ కర్నూలు: భర్త సుధాకర్ రెడ్డిని చంపిన భార్య స్వాతి హత్య కేసు కలకలం రేపుతోంది. ప్రియుడు రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త సుధాకర్కు మటన్ సూప్ అంటే ఇష్టం. రాజేష్ శాకాహారి. దీంతో అతను అడ్డంగా దొరికిపోయాడు.
అయితే అంతకుముందు కూడా చాలాసార్లు రాజేష్ పైన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇతరులకు అనుమానాం వచ్చింది. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో అనుమానాలు బయట పెట్టలేకపోయారు. అయితే ఒక్కటొక్కటిగా అనుమానాలు పెరగడం, మటన్ సూప్ తాగక పోవడంతో అప్పుడు అసలు విషయం బయటపడింది.
ఆహారపు అలవాట్లు, వ్యాపారలావాదావీలు, బంధువులు
రాజేష్ కేవలం మటన్ సూప్ తాగక పోవడమే కాదు. మరెన్నో విషయాల్లో స్పష్టత లేకుండా పోయింది. పిల్లల పేర్లు చెప్పక పోవడం నుంచి బిజినెస్ వ్యవహారాలపై అస్పష్టమైన సమాధానాలు చెప్పడం కూడా అనుమానాలకు తావిచ్చింది. హతుడు సుధాకర్ క్రషర్ వ్యాపారి. ఈ హత్య కేసులో ఆహారపు అలవాట్లు, వ్యాపార లావాదేవీలు, బంధువుల విషయంలో అస్పష్ట వైఖరి రాజేష్ను పట్టించాయి.
ముందు చంపి, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు
గత నెల 27వ తేదీన తన భర్త సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని భార్య స్వాతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే అంతకు ముందు రోజే ప్రియుడు రాజేష్తో కలిసి స్వాతి తన భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చింది. ఫతేపూర్ అటవీ ప్రాంతంలో ఆ శవాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారు. అనంతరం రాజేష్ తన ముఖంపై పెట్రోలు పోసుకొని, ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు.
మలుపు తిరిగిన కేసు
రాజేష్ను ఆ తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి రాజేష్ వ్యవహారంపై చాలామందికి అనుమానం కలిగింది. డిసెంబర్ 7వ తేదీన కేసు సంచలన మలుపు తిరిగింది. కాలిన గాయాల కారణంగా బంధువులు మటన్ సూప్ తీసుకు వస్తే శాకాహారి అయిన రాజేష్ నిరాకరించాడు.
వ్యాపారం గురించి అడిగితే అస్పష్ట సమాధానాలు
సుధాకర్ రెడ్డి బంధువు నరేందర్ రెడ్డికి, బంధువులకు రాజేష్ ప్రవర్తనపై (ఆసుపత్రిలో ఉన్నది సుధాకర్ రెడ్డి అనుకున్నారు) అనుమానం వచ్చింది. దానిమ్మ పండ్లను ఇస్తే తిన్నాడు. కానీ సూప్ తాగలేదు. దీంతో అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీలు గురించి అడిగారు. అతను అస్పష్టంగా సమాధానాలు చెప్పాడు. సుధాకర్ రెడ్డి చేసే వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియకపోవడంతో అతను అస్పష్ట సమాధానాలు చెప్పడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
పిల్లల పేర్లు రాయమంటే తడబడ్డాడు
అంతకుముందే సూప్ తాగమంటే మాట్లాడలేనని చెప్పి పేపర్ మీద రాసిచ్చాడు. బంధువులు ఆ తర్వాత పిల్లల పేర్లు రాయాలని కోరారు. దానికి అతను సరిగా స్పందించలేదు. దీంతో తమ అనుమానం నిజమేనని బంధువులకు అర్థమైంది. వెంటనే బంధువుల ద్వారా రహస్యంగా రాజేష్ ఫోటో తెప్పించుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని చెప్పినా
ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాదులో చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడారు. ఆ తర్వాత డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని చెప్పారు. కానీ రాజేష్, స్వాతిలు మాత్రం కావాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులకు అనుమానం రెట్టింపై, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది రాజేష్ అని తెలుసుకునేందుకు తాజాగా మంగళవారం ఆధారాలు సేకరించి, నిర్ధారణకు వచ్చారు. సుధాకర్ రెడ్డి ఆధార్ కార్డుకు రాజేష్ వేలి ముద్రలు సరిపోలేదు.
ప్రియుడితో కాపురం చేసేందుకు స్వాతి ప్రయత్నాలు
ముఖం కాలిన రాజేష్కు ప్లాస్టిస్ సర్జరీ చేసి ఎవరూ గుర్తు పట్టకుండా తయారు చేసేందుకు ఎంత ఖర్చునైనా వెనుకాడనని ఆసుపత్రి వర్గాలతో స్వాతి అన్నట్లగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పినా సర్జరీ చేసేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చుకు వెనుకాడేది లేదని చెప్పడం గమనార్హం. రాజేష్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్తను చంపిన కేసు నుంచి బయటపడటంతో పాటు ప్రియుడితో కాపురం చేసేందుకు స్వాతీ తీవ్ర ప్రయత్నాలు చేసింది.
ఎన్ని డ్రామాలు ఆడిందో
భర్తను చంపిన స్వాతి తన ప్రియుడితోనే ఉండేందుకు ఎన్నో డ్రామాలు ఆడింది. ఆసుపత్రిలో రాజేష్ను చేర్పించిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలుతో దాడి చేసినట్లు చెప్పింది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పారు. ఆమె వ్యవహరించిన తీరు చూస్తుంటే ఎన్ని డ్రామాలు ఆడిందోనని ముక్కున వేలేసుకుంటున్నారు.
బిల్లు ఎవరు చెల్లిస్తారనే అయోమయం
ఇదిలా ఉండగా హైదరాబాదులోని డీఆర్డీఏ ఆసుపత్రిలో 18 రోజుల పాటు రాజేష్కు జరిగిన చికిత్సకు యాజమాన్యం రూ.4 లక్షలు బిల్లు వేయగా, అందులో సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు రూ.2.10 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.1.90 లక్షల బిల్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయి ఎవరు చెల్లిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ వైపు హత్య, కుట్ర కేసుల్లో స్వాతి అరెస్టై రిమాండుకు వెళ్లింది. రాజేష్ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ముందుకు రాలేదు. దీంతో బిల్లు ఎవరు చెల్లిస్తారనేది అయోమయంగా మారింది.