నాగర్కర్నూలులో దారుణానికి తెగబడ్డ మరో స్వాతి.. ప్రియుడితో కలిసి భర్త హత్య..
మూడేళ్ల క్రితం నాగర్కర్నూలు జిల్లాలో స్వాతి అనే వివాహిత ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా స్వాతి అనే మరో వివాహిత ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిన ఘటన జిల్లాలోని తాడూరు మండలం పర్వతాయిపల్లిలో వెలుగుచూసింది. మొదట తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరించిన నిందితురాలు.. ఆ తర్వాత తానే భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది.
వివాహేతర సంబంధం..
పర్వతాయిపల్లికి చెందిన దాసరి యాదయ్య(35)కి కొన్నేళ్ల క్రితం భాగ్యమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత యాదయ్య స్నేహితుడు మెగావత్ గోవింద్ భాగ్యమ్మకు పరిచయం అవడంతో కథ మలుపు తిరిగింది. భాగ్యమ్మతో చనువు పెంచుకున్న గోవింద్ ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరూ తరుచూ కలుస్తున్నారు.
ప్రియుడితో కలిసి భర్త హత్య
భాగ్యమ్మ,గోవింద్ల వ్యవహారాన్ని గమనించిన యాదయ్య ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ భాగ్యమ్మ తన తీరు మార్చుకోకపోగా.. భర్తనే అంతమొందించాలనుకుంది. ప్రియుడితో కలిసి ఇందుకోసం ప్లాన్ వేసింది. ఫిబ్రవరి 28న బిజినేపల్లిలో ఓ తాడు,రెండు మద్యం సీసాలు కొనుగోలు చేసింది. అనంతరం ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించి మాట్లాడుకుందాం రమ్మని ఓ బ్రిడ్జి వద్దకు పిలిపించింది. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు. అదే సమయంలో భాగ్యమ్మ యాదయ్య మెడకు తాడుతో ఉరి బిగించి చంపేసింది. అనంతరం సమీపంలోని ఓ కాలువలో పడేసింది.
హత్య తర్వాత తనకేమీ తెలియనట్టుగా..
హత్య తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా నటించింది భాగ్యమ్మ. యాదయ్య ఆచూకీ కోసం మిగతా కుటుంబ సభ్యులంతా గాలించినా లాభం లేకపోయింది. చివరకు మార్చి 1న తుమ్మలసూగురు సమీపంలో యాదయ్య మృతదేహం కెనాల్లో కొట్టుకొచ్చింది. అది యాదయ్య మృతదేహమే అని నిర్దారించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Recommended Video
చివరకు నేరం అంగీకరించిన భాగ్యమ్మ..
యాదయ్య మృతదేహం లభ్యమైన చోటుకు.. అతను బైక్ దొరికిన స్థలానికి రెండు,మూడు కిలోమీటర్ల దూరం ఉండటం పోలీసులకు అనుమానం కలిగించింది. దానిపై విచారణ జరుపుతున్న సమయంలోనే భాగ్యమ్మలో ఎక్కడ దొరికిపోతానోన్న భయం ఏర్పడింది. దీంతో స్థానిక సర్పంచ్ వద్దకు వెళ్లి తానే హత్య చేసినట్టు చెప్పింది. సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు భాగ్యమ్మను అరెస్ట్ చేసి ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు.