తండ్రి అఘాయిత్యమంటూ హత్య: పిల్లల శవాలు చూడ్డానికి రజనీ నో
హైదరాబాద్: సికింద్రాబాద్లోని అడ్డగుట్ట టీచర్స్ కాలనీలో గల ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు బుధవారం రాత్రి హత్యకు గురయ్యారు. కన్న తల్లే వారిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అడ్డగుట్ట టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
రజని(40), వినయ్ దంపతులకు అవిష్క(7), తవిష్క(3) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. అవిష్క సికింద్రాబాద్లోని సెయింట్ అన్స్ స్కూల్లో యూకేజీ చదువుతుండగా తవిష్క మహేంద్రహిల్స్లోని ప్లే స్కూల్కు వెళుతోంది. వినయ్ బేగంపేట్లో గిఫ్టు డిజైనర్ వస్తువుల వ్యాపారం చేస్తున్నాడు.
ఇంట్లో పిల్లలతో పాటు అత్త ఉషా, ఆడపడుచు అనిత ఉన్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆ ఇంట్లోని బాతురూంలో ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులలో పడి ఉండగా అత్త ఉషా, ఆడపడుచు అనిత కనుగొన్నారు. సీసా పగలగొట్టి ఉంది. తల్లి రజని మాత్రం అప్పుడక్కడ కన్పించలేదు.
ఎక్కడికో వెళ్లి రెండు గంటల తరువాత వచ్చింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే, ఇద్దరు పిల్లలను చంపిన రజనీ ట్యాంక్బండ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన పిల్లలపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అది చూడలేకనే తాను పిల్లలను హత్య చేశానని రజనీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. వారం రోజుల నుంచి రజని చాలా ఆందోళనతో ఉంటున్నదని, తాను ఒంటరినని భయం భయంగా ఉన్నదని తెలిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏడేళ్ల కూతురిని తన భర్త లైంగికంగా వేధిస్తున్నాడని, ఇది భవిష్యత్తులో ప్రమాదానికి దారి తీసే ఉందనే ఉద్దేశంతో పిల్లలను చంపినట్లు రజనీ చెప్పింది. వినయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, రజనీ మానసిక స్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ కూతురిని బెడ్రూంలో ఆడుకుంటున్న కూతురిని రజనీ చంపేయగా, మరో కూతురిని పాఠాలు చెబుతానని తీసుకుని వెళ్లి చంపేసింది.
తల్లి రజనిని అరెస్టు చేశారు. పిల్లల మృతదేహాలకు పోస్టు మార్టం చేసి శవాలను బంధువులకు అప్పగించారు. పిల్లల మృతదేహాలను చూడడానికి కూడా తల్లి రజని ఇష్ట పడలేదు. వినయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తన పెద్ద కూతురిపై లైంగిక దాడికి పాల్పడడం తట్టుకోలేకపోతున్నానని రజనీ తన తల్లికి ఫోన్లో ఓ మెసేజ్ పంపినట్లు సమాచారం. లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలో నిజం లేదని పోస్టుమార్టం నివేదికలో తేలింది.