యువతి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది, బిట్స్లో ర్యాగింగ్ కలకలం
వరంగల్: ఓ ఈ కామర్స్ సంస్థ నుంచి ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చిన సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. బుక్ చేసిన వెంటనే సోల్ ఫోన్ వచ్చిందని ఓ అమ్మాయి ఆనందంగా దానిని విప్పి చూసింది. అయితే అందులో ఛార్జర్, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. కానీ ఫోన్ మాత్రం లేదు.
ఫోన్ బదులు రాయి కనిపించింది. దీంతో సెల్ ఫోన్ బుక్ చేసిన యువతి నివ్వెరపోయింది. వరంగల్ కాశిబుగ్గకు చెందిన కుసుమ సురభి స్నాప్ డీల్ ద్వారా ఫోన్ బుక్ చేసింది. బుధవారం ఆమెకు కొరియర్ వచ్చింది. అందులో స్మార్ట్ ఫోన్ కనిపించలేదు. రాయి వచ్చింది.
ఆమె ఈ నెల 22వ తేదీన రూ.1,700 ధరకే మైక్రోమాక్స్ స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు చూసి బుక్ చేసింది. బుధవారం కొరియర్ బాయ్ ఇంటికి వచ్చాడు. సురభి రూ.1,700 చెల్లించి కొరియర్ తీసుకుంది. సీల్ తీసి చూస్తే రాయి కనిపించడంతో.. కొరియర్ బాయ్ను నిలదీసింది.
తాను కేవలం కొరియర్ బాయ్ని మాత్రమేనని, తిరిగి కంపెనీకి సమాచారం ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. బాధితురాలు పలుమార్లు కంపెనీకి ఫోన్ చేసింది. తుదకు ఆమె కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేసింది.
బిట్స్లో ర్యాకింగ్ కలకలం
వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ర్యాగింగ్ కలకలం రేగింది. బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు దాడి చేయడంతో ఓ జూనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
బిట్స్లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిత్య పైన కొందరు సీనియర్ వద్యార్థులు బుధవారం రాత్రి దాడి చేశారని తెలుస్తోంది. ఈ దాడిలో అతనికి గాయాలయ్యాయి. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.