నిందితుడిని పట్టించిన 'గబ్బర్ సింగ్', లక్షల సొత్తు వెనక్కి
హైదరాబాద్: ఆటోలో ప్రయాణికురాలు నగలు, నగదుతో ఉడాయించిన ఆటో డ్రైవర్ను 'గబ్బర్ సింగ్' సినిమా పోస్టర్ పట్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నాడు అతనిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అతని నుంచి సొత్తు స్వాధీనం చేసుకొని, రిమాండుకు తరలించారు.
వాసవీ కాలనీ నివాసి మాధవి గత నెల 11వ తేదీన నల్గొండ వెళ్లేందుకు ఆర్కేపురం నుంచి ఎల్బీ నగర్ రింగు రోడ్డు వరకు ఆటోలో వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఆటోలో ప్రయాణించింది. 30 తులాల నగరు, రూ.25వేల నగదు ఉన్న బ్యాగును ఆమె ఆటోలో మరిచిపోయింది.
అనంతరం ఆమె నల్గొండ వెళ్లే బస్సు ఎక్కింది. బస్సు ఎక్కి ఆటో నగర్ వరకు వెళ్లిన తర్వాత తన నగలు ఆటోలో మరిచిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆమె వెనక్కి వచ్చి చూశారు. ఆమె తన వెంట మూడు సంచులు తెచ్చుకుంది. అందులో ఓ సంచిని మరిచిపోయింది. అందులోనే విలువైన వస్తువులు ఉన్నాయి.
అక్కడకు వచ్చేసరికి ఆటో లేకపోయేసరికి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆటో నంబరు సరిగా కనిపించలేదు. అయితే, డ్రైవర్ కూర్చున్న చోట గబ్బర్ సింగ్ అనే సినిమా స్టిక్కర్ ఉందని మాధవి తెలిపారు.
పోలీసులు ఆ వివరాల ప్రకారం ఆటో డ్రైవర్లను పిలిచి విచారించారు. ఆ స్టిక్కర్లు ఉన్న ఆటోలన్నీ వెతికారు. చివరికి అసలు ఆటో జాడ తెలిసింది. ఆ ఆటో యజమానిని నిలదీశారు. అయితే, నగలు పోయిన రోజు తాను ఆటో నడపలేదని చెప్పాడు. తన సమీప బంధువు అద్దెకు నడిపాడని చెప్పాడు.
నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం జనగాం సమీపంలోని పాలగుట్ట తండాకు చెందిన కేలోత్ బోజ్య(32) గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఇటీవలే నగరానికి వచ్చి దగ్గరి బంధువుకు చెందిన ఆటో అద్దెకు తీసుకుని నడిపాడు.
వారం రోజులు గడవకముందే ఇలా ప్రయాణికురాలు తన నగలను ఆటోలో మరిచిపోవడంతో వాటిని తీసుకెళ్లాడు. మరుసటి రోజునే ఆటోను యజమానికి అప్పగించి, తాను కొత్త ఆటో కొంటానని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. నగలను ఇంట్లో దాచి నగదు ఖర్చు చేశాడు. పోలీసులు అతనిని పట్టుకుని 30తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.