న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
హైదరాబాద్: తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కేపీహెచ్బీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. కేపీహెచ్బీ కాలనీ 3వ రోడ్డులోని ఎల్ఐజీ-465లో నివాసముండే పసులేటి పవన్ కుమార్ కేఎల్ఎం ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాలనీలో నివసిస్తున్నాడు.
ఈ ఏడాది జూన్లో మల్లాపూర్ నాచారానికి చెందిన శ్రీవిద్య అనే యువతితో మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకుని పెళ్లి సమయంలో పవన్కు కట్నంగా సుమారు రూ. 15 లక్షల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెళ్లైన వారం రోజుల నుంచే భార్యభర్తల మధ్య మనస్పర్ధాలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి సంసారాన్ని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
విడిపోవడానికి నిర్ణయించుకున్నారీ దంపతులు... అయితే శ్రీవిద్యకు రూ. 16 లక్షలు ఇవ్వడానికి అంగీకరించిన పవన్ కుమార్ కుటుంబీకులు అవి ఇవ్వకపోవడంతో శనివారం కేపీహెచ్బీ కాలనీలో భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది.
బాధితురాలు శ్రీవిద్యను వివరాలు అడగగా ఈ విషయంపై గతంలోనే నాచారాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని, మళ్లీ అక్కడే ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. పెద్దలు చెప్పిన ప్రకారం తనకు న్యాయం జరగలేదనే కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.
భర్త కుటుంబ సభ్యులు తీరుతో చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. మరోవైపు పవన్ కుమార్ కుటుంబ సభ్యులు ఇప్పటికే సమాజంలో తమ కుటుంబ పరువు పోయిందని, పెద్దలు చెప్పిన మొత్తాన్ని తాము చెల్లించే పరిస్థితుల్లో లేమని పోలీసుల వద్ద వారు వాపోయారు.
దీంతో ఇరు కుటుంబాలను శాంతింపజేశారు. ఇదిలా ఉంటే కేసు ఇప్పటికే నాచారం పోలీసు స్టేషన్లో నమోదు కావడంతో కేసు నమోదు చేయలేదని కేపీహెచ్బీ పోలీసులు స్పష్టం చేశారు.