8ఏళ్లు ఆమెను మోసం చేసి: పెళ్లికి మాత్రం 'నో'.. ప్రియురాలి మౌనదీక్ష
ప్రేమ పేరుతో తనను వంచించాడని ఆరోపిస్తూ సృజన అనే యువతి ప్రియుడు సంతోష్ ఇంటిముందు మౌనదీక్షకు దిగింది.
భూపాలపల్లి: ప్రేమ పేరుతో యువతికి దగ్గరై.. 8ఏళ్లు ఆమెతో సంబంధం కొనసాగించి.. పెళ్లి మాటెత్తెసరికీ మాత్రం ముఖం చాటేశాడో ప్రియుడు. ఇన్నాళ్లు అతనిపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కావడంతో.. ఏం చేయాలో తెలియని స్థితిలో.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనదీక్షకు దిగింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం గూడూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన బొమ్మ సంతోష్ అనే యువకుడు.. సృజన అనే యువతి 8ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో సంతోష్ ఆమెకు శారీరకంగాను దగ్గరయ్యాడు.
అయితే ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో.. పెళ్లి చేసుకోవాల్సిందిగా సృజన సంతోష్ను గట్టిగా నిలదీసింది. దీంతో రేపు.. మాపు.. అటూ గత 5నెలల నుంచి అతను తప్పించుకు తిరుగుతూనే ఉన్నాడు. ఇదే క్రమంలో సృజన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ రాతపూర్వకంగా హామి ఇచ్చాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ షరా మామూలే అయిపోయింది. ఇంట్లో ఒప్పుకోవడం లేదని చెబుతూ ముఖం చాటేసి తిరుగుతున్నాడు. దీంతో సంతోష్ తనను పెళ్లి చేసుకునేవరకు కదిలేది లేదంటూ అతని ఇంటిముందు సృజన మౌనదీక్షకు దిగింది. పెళ్లి జరిగేవరకు అక్కడే ఉంటానని చెబుతోంది.