నల్లమల అడవుల్లో మహిళపై అత్యాచారం..దారుణ హత్య: కేసును ఛేదించి..: సాధువు అరెస్ట్..!
హైదరాబాద్: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలాన్ని సందర్శించడానికి ఒంటరిగా వచ్చిన మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో పోలీసులు బ్రేక్ త్రూ సాధించారు. మూడు రోజుల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఆ నిందితుడు ఓ సాధువు. నల్లమల అడవుల్లో వెలసిన అక్క మహాదేవి ఆలయాలను సందర్శించడానికి తోడుగా వస్తానంటూ ఆ మహిళ వెంట వెళ్లిన సాధువే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ డీఎస్పీ నరసింహులు గురువారం వెల్లడించారు. నిందితుడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఆ సాధువు పేరు మట్కా స్వామి. తమిళనాడుకు చెందన సాధువు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన మట్కా స్వామి కొంతకాలంగా శ్రీశైలంలో నివసిస్తున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీస్స్టేషన్ పరిధిలోని అక్క మహదేవి ఆలయాల సమీపంలోని అడవిలో మూడు రోజుల కిందట ఓ మహిళ మృతదేహం లభించింది.
మృతురాలిని పుణేకు చెందిన భక్తురాలిగా గుర్తించారు. శ్రీశైల ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన ఆమెతో మట్కాస్వామి పరిచయం పెంచుకున్నాడు. నల్లమల అడవుల్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయని, వాటిని చూపిస్తానని నమ్మించాడు. శ్రీశైలం నుంచి సున్నిపెంటకు ఓ జీపులో ఆమెతో వెళ్లాడు. అక్కడినుంచి అక్క మహాదేవి గుహల మార్గం వైపు బయలుదేరి వెళ్లారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన తరువాత మట్కాస్వామి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు కోసి హత్య చేశాడు.
మృతురాలి బ్యాగు, సెల్ఫోన్ అక్కడే పారేశాడు. ఏమీ తెలియనట్లు శ్రీశైలానికి చేరుకున్నాడు. పుణే మహిళ మృతదేహం లభించిన తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మర దర్యాప్తును చేపట్టారు. హత్యకు గురైన మహిళతో మట్కాస్వామితో కలిసి వెళ్తున్న దృశ్యాలు శ్రీశైలం, సున్నిపెంటల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనితో అతడిని అదుపులోకి తీసుకొని, విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.