మహిళను రేప్ చేసి, హత్య చేశాడు: తలా కాళ్లూ కోసేశాడు
ఓ మహిళ అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైంది. దుండగుడు ఆమెను రేప్ చేయడమే కాకుండా తలాకాళ్లూ కోసి హత్య చేశాడు.
సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఓ 30 ఏళ్ల వయస్సు గల మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. మహిళపై ఆగంతకుడు అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆభరణాల కోసం ఆమె తలను, కాళ్లను కోసేశాడు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన లావణ్య ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లింది. అదే గ్రామానికి చెందిన రంగు పరుశరాములు అనే దుర్మార్గుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత హత్య చేసి కాళ్లు, తల కోసి ఆభరణాలను తీసుకున్నాడు. తర్వాత మృతదేహాన్ని సంచిలో వేసుకొని గ్రామ శివారులోని ముళ్లపొదల్లో పడేశాడు.
ఆదివారం అర్థరాత్రి బహిర్భూమికి వెళ్లిన లావణ్య తిరిగి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆమె కోసం గాలిస్తున్న క్రమంలో కాలనీ సమీపంలో రక్తం మరకలు కన్పించాయి. దాంతో ఊరు చుట్టుపక్కల వెతికారు. చివరకు పెద్ద చెరువు సమీపంలో శవంగా కన్పించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించారు.
యువతి కాళ్లు నరికి, గొంతు కోసినట్లుగా ఉండడంతో హత్యకు గురైనట్లు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసు జాగిలాన్ని రప్పించారు. ఈ జాగిలం శవం పడి ఉన్న చోటు నుంచి యువతి ఇంటి సమీపంలో రక్తం మరకలు కన్పించిన చోటికివచ్చి నిలిచిపోయింది. అప్పటికే యువతి హత్యకు గురైనట్లు తెలియడంతో వడ్డెర కాలనీకి చెందిన ఆమె బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
యువతి మృదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించకుండా అడ్డుకున్నారు. శవాన్ని తరలించేందుకు తెచ్చిన ఆటోను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిద్దిపేట, గజ్వేల్ ఏసీపీలు నర్సింహారెడ్డి, గిరిధర్, సిద్దిపేట రూరల్ సీఐ సైదులు, ఎస్సై శ్రీనివాస్తో పాటు సమీప పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను రప్పించారు.
లావణ్య కూతురు అంజలి, కుమారులు గణేశ్, శివమణి, అత్త ఎల్లవ్వ, మామ కనకయ్యలతో కలిసి ఆమె నివాసం ఉంటోంది. భర్త రాజు దుబాయ్లో ఉంటున్నాడు. లావణ్య మామ కనకయ్య ఫిర్యాదు మేరకు గట్లమల్యాల గ్రామానికి చెందిన రంగు పరశురాములు గౌడ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట ఏసీపీ నరసింహారెడ్డి తెలిపారు. లావణ్యపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపడమే కాక, కాళ్లు కోసి కాళ్ల కడియాలు ఎత్తుకెళ్లినట్లు వారు చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.