9ని.ల్లోనే అంతా, చంపొద్దని బతిమాలినా విన్లేదు, చనిపోయేదాకా మీద కూర్చున్నాడు: విచారణలో షాకింగ్
హైదరాబాద్: యూసఫ్గూడ సమీపంలోని జవహర్ నగర్లోని నగల దుకాణంలో జరిగిన వెంకటలక్ష్మి (19) హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు స్పష్టతకు వచ్చారు. నిందితుడు సాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య సమయంలో యువతి ఎంతగా వేడుకున్నా నిందితుడు కనికరించలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరొకరితో చనువుగా ఉందని, పెళ్లికి అంగీకరించలేదనే: సీసీ ఫుటేజీలో దారుణ హత్య, సాగర్ ఇలా దొరికాడు
సాగర్ (27)పై గతంలో నర్సంపేటలో పని చేసిన ఓ పోలీసు అధికారికి నమ్మకం ఏర్పడింది. దీంతో సాగర్ను సదరు అధికారి తన వెంట తీసుకు వచ్చుకున్నారు. మధురానగర్లో ఉంటున్న సాగర్ జవహర్ నగర్లో ఉంటున్న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన వెంకటలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమకు దారి తీసింది. అనంతర పరిణామాలతో అతను రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.
సాగర్ను పెళ్లి చేసుకోవాలని యువతికి కౌన్సెలింగ్
విషయం తెలుసుకున్న వెంకటలక్ష్మి తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోవాలని సాగర్ను గతంలో హెచ్చరించారు. ప్రవర్తన మారకపోవడంతో యువతి సోదరుడు, కుటుంబ సభ్యులు సాగర్ పైన ఓసారి భౌతిక దాడికి కూడా దిగారని తెలుస్తోంది. సాగర్ను పెళ్లి చేసుకోవాలని యువతికి కౌన్సెలింగ్ ఇవ్వగా, ఆమె అంగీకరించలేదని కూడా తెలుస్తోంది. తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ఆమె చెప్పారు.
చనిపోయే వరకు ఆమెపై కూర్చున్నాడు
ఇటీవల ఆమె మరో యువకుడితో బైక్ పైన వెళ్లడాన్ని గమనించిన సాగర్ ఆ విషయమై ఆమెను ప్రశ్నించేందుకు దుకాణంకు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకుంటే హత్య చేసేందుకు కూడా ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడు. అందుకే సోమవారం మధ్యాహ్నం దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఆమె వద్దకు వచ్చి ఘర్షణ పడి, గొంతు నులిమాడు. ఆ తర్వాత ఆమె ఏదో అనడంతో మళ్లీ తిరిగి వచ్చి ప్యాంటు జేబులో ఉన్న బ్లేడు తీసి.. ఆమె మెడ పట్టుకొని కింద పడేశాడు. అతని నుంచి తప్పించుకొని పైకి లేచేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ ఆమెపై కూర్చొని బ్లేడుతో కోశాడు.
ముందు నుంచీ నేరస్వభావమే
ఆమె చనిపోయేంత వరకు యువతి మీదనే కూర్చున్నాడు. వెళ్తూ వెళ్తూ షట్టర్ కిందకు వేసి వెళ్లాడు. కారుతున్న రక్తాన్ని ఆపేందుకు యువతి చున్నీని మెడ చుట్టూ కట్టుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ఇదంతా తొమ్మిది నిమిషాల్లో జరిగిందని చెబుతున్నారు. చంపవద్దని ఆమె ఎంత వేడుకున్నా ఆ కర్కోటకుడి మనసు కరగలేదు. సాగర్ది ముందు నుంచి నేర స్వభావమేనని అంటున్నారు.
దుకాణ యజమానులకు నమ్మకస్తురాలు
వెంకటలక్ష్మి జోడీ ఫ్యాషన్ జువెల్లరీ దుకాణంలో పని చేస్తూ తక్కువ కాలంలోనే దుకాణ యజమానులకు ఇంట్లో మనిషిలా మారింది. గత నెల 14న వెంకటలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను పని చేసే దుకాణంలోనే సందడిగా చేశారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, మంగళవారం బందోబస్తు మధ్య అంతిమయాత్ర నిర్వహించారు.
నేరస్తుడిని ఉరితీయాలని డిమాండ్
అంతకుముందు తల్లిదండ్రుల హెచ్చరికలతో కొన్నాళ్లు ఆగిపోయిన సాగర్.. గత రెండు నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. కాగా, వెంకటలక్ష్మిని దారుణంగా హత్య చేసిన నిందితుడు సాగర్ను ఉరి తీయాలని మంగళవారం ఉదయం స్థానికులు ర్యాలీ తీశారు. పోలీసులు వారిని సముదాయించి పంపించారు.