'బాస్' చెప్పినందుకే నగ్న వీడియోలు!: కేపీహెచ్బి హాస్టల్ ఆకృత్యం వెనుక..
శివయ్య చెప్పినట్లుగానే బాధితురాలి రూమ్ మేట్ వాట్సాప్ ద్వారా శివయ్యకు ఆ ఫోటోలు చేరవేసింది. అంతేకాదు, నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి అందులో ఫోటోలు అప్ లోడ్ వచ్చింది.
కేపీహెచ్బి: సోమవారం నాడు కేపీహెచ్బి పరిధిలోని అడ్డగుట్ట హాస్టల్లో వెలుగుచూసిన ఆకృత్యం స్థానిక హాస్టల్ యువతులను సైతం ఆందోళనకు గురిచేసింది. తోటి రూమ్ మేట్ తనకు తెలియకుండా తన నగ్న ఫోటోలు, నగ్న వీడియోలు వాట్సాప్ లో ఇతరులకు షేర్ చేయడంతో.. బాధిత యువతి తీవ్ర వేధింపులకు గురైంది.
ఎట్టకేలకు బాధిత యువతి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టు అనంతరం పోలీసులు వివరాలు వెల్లడించారు. పొద్దుటూరుకు చెందిన ఓ 32ఏళ్ల యువతి కూకట్ పల్లి సొసైటీలోని పూజిత ఉమెన్స్ డీలక్స్ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. సదరు యువతి గదిలోనే బాధితురాలు రూమ్ మేట్ గా ఉంది.
వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొన్నాళ్లు ఇద్దరిని ఒకే దగ్గర పనిచేసేలా చేసింది. అలా.. నగరంలోని హైమా కన్సల్టెన్సీ అనే సంస్థలో కొన్నిరోజులు ఇద్దరు కలిసి ఉద్యోగం చేశారు. ఆ సమయంలో సంస్థ డైరెక్టర్ ఆలపాటి శివయ్య నుంచి బాధితురాలు వేధింపులు ఎదుర్కొంది.దీంతో కొన్నాళ్లకు అందులో ఉద్యోగం మానేసిన బాధితురాలు.. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా చేరింది.
బాధితురాలు ఉద్యోగం మానేయగా.. పొద్దుటూరుకు చెందిన ఆమె రూమ్ మేట్ మాత్రం అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇదే క్రమంలో హైమా కన్సల్టెన్సీ డైరెక్టర్ ఆలపాటి శివయ్య బాధితురాలి రూమ్ మేట్ ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. ఇందుకోసం బాధితురాలి నగ్న ఫోటోలు, వీడియోలు కావాలని బాధితురాలి రూమ్ మేట్ ను కోరాడు.
శివయ్య చెప్పినట్లుగానే బాధితురాలి రూమ్ మేట్ వాట్సాప్ ద్వారా శివయ్యకు ఆ ఫోటోలు చేరవేసింది. అంతేకాదు, నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి అందులో ఫోటోలు అప్ లోడ్ వచ్చింది. రూమ్ మేట్ తీరుపై అనుమానం వచ్చిన బాధితురాలు.. ఆమె ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో తనిఖీ చేయగా అందులో తన నగ్న ఫోటోలు, వీడియోలు కనిపించాయి.
దీంతో రూమ్ మేట్ ను బాధితురాలు గట్టిగా నిలదీసింది. హైమా కన్సల్టెన్సీ డైరెక్టర్ శివయ్య ఆదేశానుసారమే తాను ఇలా చేయాల్సి వచ్చిందంటూ సమాధానం ఇచ్చింది. అనంతరం బాధితురాలు సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు. సైబరాబాద్ ఇన్స్పెక్టర్ పి.రవీందర్ నేతృత్వంలోని టీమ్ వారిని కూకట్ పల్లి పదహారో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.