'అప్పుడు ఏదో చేయాలనిపించింది, అప్పుడప్పుడు కార్తీక్ ఇంటికి సంధ్య, బావకు తెలుసు'
హైదరాబాద్: తాను సంధ్యను చాలా పిచ్చిగా ప్రేమించానని, తనను పెళ్లి చేసుకోకుండా వదిలించుకోవాలని నిర్ణయించుకోవడంతో తన చేయి దాటి పోతుందనే ఆందోళనతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించానని ప్రేమోన్మాది కార్తిక్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
Recommended Video
చదవండి: ఒక ప్రణాళిక ప్రకారమే చేశాడు, నాముందే వాడినీ కాల్చేయాలి: సంధ్య తల్లి ఆక్రోశం
జైలుకు తరలించే ముందు పోలీసులు అతనిని విచారించారు. తనకు ద్రోహం చేసిందన్న కక్షతో ఈ పని చేశానని చెప్పాడు. గురువారం తనను కలిసినప్పుడు నీతో నాకు సంబంధం లేదని, నువ్వు ఇచ్చిన ఫోన్ మా ఓనర్కు ఇచ్చేశానని చెప్పిందని, ఆ క్షణంలోనే ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందన్నాడు.
సంధ్య పెద్దలు మాట్లాడితే ఈ ఘోరం జరగకపోయేది
సంధ్యారాణితో ప్రేమ వ్యవహారంతో తన కొడుకు కార్తీక్ పూర్తిగా పిచ్చివాడు అయ్యాడని, సంధ్య ఇంట్లో పెద్దలు తమతో మాట్లాడి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని కార్తీక్ తల్లి ఊర్మిళ పేర్కొన్నారు. మరోవైపు, కనిపిస్తే చితక్కొడతారనే కార్తీక్ పోలీసుల ఎదుట తెలివిగా లొంగిపోయాడని సంధ్య తల్లి వాపోయారు.
కార్తీక్ దురలవాట్లతో వదిలించుకోవాలని
ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. కార్తీక్ సెల్ఫోన్, పెట్రోలు, సీసా, సంధ్య వేసుకున్న దుస్తులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కార్తీక్ను ఉద్యోగంలో నుంచి తీసేశాక అతడి ప్రవర్తన మారిపోయిందని పోలీసులు తెలుసుకున్నారు. వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి, సంధ్య వైపు ఏవైనా తప్పులు ఉన్నాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సన్నిహితులు, స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
సంధ్యకు ఫోన్ చేసి రమ్మని విసిగించేవాడు
ఉద్యోగం పోయిన తర్వాత కార్తీక్ మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడని, ఫలానా చోట ఉన్నానని, కలుసుకుందాం రమ్మంటూ సంధ్యకు ఫోన్ చేసి విసిగించేవాడని, రానని చెబితే తిట్టేవాడని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అప్పుడప్పుడు ఆమెను డబ్బు అడిగేవాడని గుర్తించారు.
అందుకే వదిలించుకోవాలనుకుంది
తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అతడిని వదిలించుకోవాలని సంధ్య నిర్ణయం తీసుకొని ఉండవచ్చునని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతను కొనిచ్చిన ఫోన్ను తిరిగి ఇవ్వాలనుకుంది.
ఆ తర్వాతే ప్రేమికులుగా మారారు
అంతకుముందు లాలాగూడలోని భజనమందిరం సమీపంలోకి సంధ్యారాణి కుటుంబం వచ్చినప్పుడు కార్తీక్ వీరిని పట్టించుకునే వాడు కాదని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగులుగా చేరాకే ప్రేమికులుగా మారారని తెలుస్తోంది.
అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది
సంధ్య, కార్తీక్లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరిని తాను ఓసారి బస్టాండులో చూశానని, తన కొడుకును విషయం అడిగానని, అప్పుడు ప్రేమ గురించి చెప్పాడని, తాను వారిని ఏమీ అనలేదని కార్తీక్ తల్లి ఊర్మిళ చెప్పారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని ఊర్మిళ చెప్పారు.
ప్రేమ వ్యవహారం సంధ్య తల్లి, బావలకు తెలుసు
కొద్ది రోజుల క్రితం సంధ్య ఫోన్ చేసి కార్తీక్ వేధిస్తున్నాడని చెప్పగా, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా చెప్పమని అడిగానని, తాను చేసుకోనని చెప్పిందని, దాంతో ఇకపై మా వాడికి ఫోన్ చేయవద్దని సూచించానని కార్తీక్ తల్లి చెప్పారు. సంధ్య తనకు దక్కదేమోనని కార్తీక్ ఇలా చేశాడని, వీరి ప్రేమ వ్యవహారం సంధ్య తల్లి, బావలకు తెలుసునని చెప్పారు.