మంచంపై పూలు, పండ్లు.. పక్కనే ఉరేసుకుని ఆమె: అసలేం జరిగింది?
Recommended Video
నిజామాబాద్: ఆమె పెళ్లికి అంతా నిశ్చయమైంది. వచ్చే నెల 6న ముహూర్తం కూడా ఖరారైంది. పెళ్లి పనులను చక్కపెట్టిన తల్లిదండ్రులు.. స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. వాళ్లటు వెళ్లారో లేదో.. పిడుగు లాంటి వార్త. పెళ్లి కావాల్సిన తమ కుమార్తె.. ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి నగర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది.
అసలేమైంది?:
ఆర్టీసీ ఉద్యోగి అయిన గంగాధర్గౌడ్.. తన భార్య, కుమార్తెలతో కలిసి మహాలక్ష్మినగర్లో నివాసం ఉంటున్నారు. ఇటీవలే కుమార్తె ప్రజ్ఞ(28)కు ఓ పెళ్లి సంబంధం ఖాయం చేశారు. వచ్చే నెల 6న ముహూర్తం కూడా నిర్ణయించారు.
తిరుపతి వెళ్లారో లేదో..
పెళ్లికి ముందు స్వామి దర్శనం చేసుకుని రావాలనే ఉద్దేశంతో గంగాధర్ భార్యను తీసుకుని సోమవారం ఉదయం తిరుపతి బయలుదేరారు. ఇంట్లో కుమార్తె ఒక్కరే ఉన్నారు. గంగాధర్ దంపతులు తిరుపతి చేరుకున్నారో.. లేదో.. కుమార్తె చనిపోయిందంటూ పిడుగు లాంటి వార్త వారి నెత్తినపడింది.
ఉరేసుకుని కనిపించిన ప్రజ్ఞ:
మంగళవారం మధ్యాహ్నాం వరకు ఇంటి తలుపులు మూసే ఉండటంతో పక్కింటివారికి అనుమానం వచ్చింది. దీంతో కిటికీ తలుపులు తెరిచి చూడగా.. లోపల ప్రజ్ఞ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మంచంపై పూలు, పండ్లు..:
సంఘటనా స్థలం పలు అనుమానాలకు తావిచ్చేదిగా ఉండటం గమనార్హం. ప్రజ్ఞ ఉరేసుకున్న గదిలో.. మంచంపై పూలు, పండ్లు కనిపించాయి. పక్కనే ఓ కేకు కూడా కట్ చేసి ఉంది. అంతేకాదు, ఆమె మెడలో పసుపుతాడు, అక్కడే కొన్ని మాత్రలు కూడా కనిపించడం గమనార్హం.
దీంతో ప్రజ్ఞ ఆత్మహత్య చేసుకుందా?.. లేక ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కచ్చితంగా ఆ గదిలోకి ఇంకెవరో వచ్చి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి. యువతికి ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.