రూ.4 లక్షలతో ఏసీబీకి దొరికిన తమ్ముడు: లొంగుబాటుకు సంధ్య మంతనాలు!
హైదరాబాద్: ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి తొలి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటూ తమ్ముడు నాగేశ్వర రావు గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో పరారైన అంబర్పేట మహిళా తహిసల్దార్ సంధ్యా లొంగిపోయేందుకు మంతనాలు సాగిస్తోందని తెలుస్తోంది.
తహసీల్దార్ సంధ్య తన బంధువులు, స్నేహితుల ద్వారా ఏసీబీ ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమె పరారీలో ఉండి 24 గంటలు గడుస్తోంది. అయినప్పటికీ ఎక్కడ ఉందో ఇప్పటి వరకు తెలియరాలేదు.
ఆమె ఎక్కడుందో తెలుసుకునేందుకు ఎసిబి అధికారులు ప్రయత్నాలు చేశారు. ఆమె సెల్ ఫోన్ ఆధారంగా ఎక్కడుందో వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ... ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో కుదరలేదు.
తన సోదరుడు ఏసీబీకి పట్టుబడిన విషయం తెలియగానే సంధ్యతో పాటు ఆమె భర్త, పిల్లలు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. సంధ్య, ఆమె భర్తతో పాటు పిల్లలను ఎక్కడ ఉంచారో తెలియాల్సి ఉంది. ఆమె లొంగుబాటు గురించి సాయంత్రం వరకు పూర్తిగా తెలిసే అవకాశాలున్నాయి.
గురువారం నాడు సంధ్య సోదరుడు నాగేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో అతను రెండుసార్లు తన అక్క సంధ్యకు ఫోన్ సందేశం పెట్టాడు. ఆమె ఫోన్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అతను ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత పరారయింది.
ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ కోసం అత్తార్ నుంచి తొలుత ఆమె రూ.9 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు ఏడు లక్షల రూపాయలకు బేరం కుదిరింది. గురువారం నాడు రూ.4 లక్షలు ఇస్తానని చెప్పడంతో.. సంధ్య తన సోదరుడు నాగేశ్వర రావును పంజాగుట్టకు పంపించింది. అప్పుడే ఏసీబీ అతనిని అరెస్టు చేసింది.
తహసీల్దార్ సోదరుడు నాగేశ్వర రావు డబ్బులు తీసుకున్నాడని, వాటిని లెక్కపెడుతుండగా తాము ట్రాప్ చేశామని హైదరాబాద్ ఎసిబీ డిఎస్పీ రవి కుమార్ చెప్పారు. అతని సోదరి సంధ్య జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశానికి వెళ్లిందని, అందుకే ఆమె సోదరుడు డబ్బు తీసుకున్నాడని చెప్పారు.
తన తమ్ముడు ఫోన్ చేసినా తీయక పోవడంతో తహసీల్దార్ సంధ్య అనుమానించి జిహెచ్ఎంసీ సర్కిల్ 9బి కార్యాలయం నుంచి పరారయ్యారు. మరోవైపు, గురువారం సాయంతరం ఏసీబీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో అంబర్ పేట మండల కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కార్యాలయంలో ఉండాల్సిన వివాదాస్పద స్థల పేపర్లు కనిపించలేదని సమాచారం.