వీళ్లేం డాక్టర్లురా నాయనా: చనిపోయిందన్నారు..అంత్యక్రియల సమయానికి ఊపిరి తీసుకుంది
జగిత్యాల: అందరికీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తకొచ్చే వైద్యులు మృతదేహానికి ట్రీట్ మెంట్ చేసి బతికించే ప్రయత్నం చేసే సీన్. కానీ జగిత్యాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అంటే వ్యక్తి చనిపోక ముందే చనిపోయారని చెప్పి ఇంటికి పంపించేశారు.
జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన కనకమ్మ అనే ఓ మహిళ రోడ్డు ప్రమాదంతో తీవ్రగాయాలపాలైంది. వెంటనే కనకమ్మను ఆస్పత్రికి తరలించారు. ఇక వైద్యం అందించిన వైద్యులు కనకమ్మ చనిపోయిందని ధృవీకరించారు. దీంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కన్నీరు మున్నీరయ్యారు. ఇక చనిపోయిన మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటిముందు టెంటు వేసి మృతదేహాన్ని మంచంపై ఉంచారు.
ఇక అంత్యక్రియలకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు తమ దగ్గరివారిని బంధువులకు చివరి చూపుకోసం రావాల్సిందిగా సమాచారం ఇస్తున్నారు. మరోవైపు కనకమ్మ మృతదేహం ముందు ఆర్తనాదాలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో కుటుంబ సభ్యులకు మరోసారి షాక్గురయ్యారు. ఒక్కసారిగా కనకమ్మ శ్వాసతీసుకోవడం ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులకు ఏమిజరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్నగా కదిలింది. అంతే ఆమె బతికే ఉందని గ్రహించారు. ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. వెంటనే జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే కనకమ్మ చనిపోయిందని వైద్యులు నిర్లక్ష్యంగా వ్వవహరించారని మండిపడ్డారు. వైద్యులై ఉండి ఒక పేషెంటు బ్రతికి ఉండగానే చనిపోయిందని ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నించారు. ఆ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులను విధుల నుంచి తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.