ఆమె పబ్ నుంచి తిరిగొచ్చాక భర్తతో గొడవ!: తెల్లారేసరికి ఉరేసుకుని కనిపించింది..
హైదరాబాద్: భర్తతో విభేదాలు ఓ వివాహితను ఆత్మహత్యకు పురిగొల్పాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇద్దరి మధ్య తరుచూ వివాదాలు తలెత్తేవని తెలుస్తోంది. భర్త అనుమానం, ఆర్థిక సమస్యలే ఆత్మహత్య వెనుక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యతో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. హైదరాబాద్ లోని చందానగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎవరామె?:
వనస్థలిపురానికి చెందిన చిన్నలక్ష్మి, వీరభద్రం దంపతుల చిన్న కుమార్తె జి. రేఖ(30). లంగర్హౌస్కు చెందిన ఉజ్వల్ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. వృత్తిరీత్యా ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అయిన వీరు.. గచ్చిబౌలిలోని ఐబీఎం సంస్థలో పనిచేస్తున్నారు. చందానగర్ లోని అపర్ణ గార్డినియా ప్లాట్నెంబర్ ఎ801లో నివసిస్తున్నారు.
ఇద్దరి మధ్య విభేదాలు..:
ఉజ్వల్-రేఖ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు వనస్థలిపురంలోని అమ్మమ్మ-తాతయ్య వద్దకు వెళ్లారు. ఇటీవల దంపతులిద్దరు వీకెండ్స్ లో విపరీతంగా షాప్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఖర్చులు ఎక్కువై సంపాదించిన డబ్బు సరిపోక ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్టు సమాచారం. దానికి తోడు ఎవరితో ఫోన్ మాట్లాడినా ఉజ్వల్ రేఖను అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవైనట్టు తెలుస్తోంది.
పబ్ నుంచి వచ్చాక గొడవ..:
శనివారం తమ సంస్థ ఉద్యోగులందరికి జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో ఐబీఎం సంస్థ పార్టీ ఇచ్చింది. ఉజ్వల్ భార్యను రాత్రి 7.30 గంటల సమయంలో పబ్ వద్ద దించి తాను తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11గం.కి ఆమెను పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో తరచూ ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని ఆమెను ప్రశ్నించాడు. 5రోజుల నుంచి అన్నం వండటం లేదని, ఎప్పుడూ బయటే తినాల్సి వస్తుందని కోప్పడ్డాడు.
తెల్లారేసరికి ఆత్మహత్య..:
శనివారం రాత్రి గొడవ తర్వాత ఇద్దరు వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఆమె పక్క గదిలో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఉజ్వల్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. ఆఖరికి తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా.. తన ముందే మాట్లాడాలని, కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాలని ఆంక్షలు పెట్టేవాడని అంటున్నారు. ఉజ్వల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందని, తను వద్దన్న రోజున ఈ భూమి మీద ఉండనని రేఖ గతంలో చెప్పినట్టు ఆమె సోదరి తెలిపారు.