ఏం జరిగింది?: టెక్కీ 'నందిని' ఆత్మహత్యపై అనుమానాలు.., ఏడుస్తూ తల్లికి చివరి ఫోన్ కాల్!
హైదరాబాద్: వరకట్న వేధింపులు మహిళలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కట్నం వేధింపులు తాళలేక బలైపోతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.
తాజాగా హైదరాబాద్ లోని రామాంతాపూర్ లో ఓ సాఫ్ట్ ఇంజనీర్ ఇలాగే బలైపోయింది. అత్తింటి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
2014లో పెళ్లి.. భారీ కట్నం
నల్గొండ జిల్లా, చౌటుప్పల్కు చెందిన దానయ్య, సులోచన కూతురు సల్వేరు గ్రీష్మానందిని (24) హైదరాబాద్ లో సాప్ట్వేర్ ఉద్యోగిని. రామంతాపూర్కు చెందిన సల్వేరు దీపక్తో 2014 జూన్ 22న ఆమె వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో నందిని కుటుంబం భారీగానే కట్న కానుకలు ఇచ్చింది. రూ.25 లక్షల కట్నంతోపాటు బంగారం, ఇతర కానుకలను ఇచ్చారు. అయినప్పటికీ.. మరో రూ.25లక్షలు అదనపు కట్నం కావాలనడంతో అడిగినంత ఇచ్చారు.
మరోసారి రూ.25లక్షలు..
మరోసారి రూ.25లక్షలు ఇచ్చినప్పటికీ వారి కట్న దాహం తీరలేదు. నందిని తండ్రి ప్రభుత్వ స్కూల్లో హెడ్ మాస్టర్. వీఆర్ఎస్ తీసుకుంటే ఎక్కువ డబ్బులొచ్చే అవకాశముంది. దీంతో ఆ డబ్బులోను కొంత తీసుకురావాలంటూ నందినిని అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు.
ఉద్యోగం కూడా మాన్పించి:
సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న గ్రీష్మానందిని.. తనకొచ్చే జీతం డబ్బులు మొత్తం అత్తింట్లోనే ఇచ్చేది. వారం క్రితమే ఆమెను ఉద్యోగం నుంచి కూడా మాన్పించారు. కట్నం వేధింపులకు తోడు.. పెళ్లయి మూడేళ్లయినాన సంతానం కలగట్లేదన్న వేధింపులు కూడా మొదలయ్యాయి.
తల్లికి ఫోన్:
అత్తింటివారి వేధింపులతో నలిగిపోయిన గ్రీష్మ బుధవారం తన తల్లి సులోచనకు ఫోన్ చేసింది. భర్త ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వగా.. తల్లి తిరిగి ఫోన్ చేసింది. తన వద్ద ఫోన్ కూడా లేదని, ఇంట్లో నుంచి మాట్లాడే పరిస్థితి కూడా లేదని చెబుతూ కన్నీరుమున్నీరైంది. ఆపై ఏమైందో ఏమో తెలియదు కానీ గ్రీష్మ ఆత్మహత్య చేసుకుందంటూ సమాచారం అందినట్లు తెలిపింది.
వాళ్లే చంపేశారు?
బుధవారం సాయంత్రం గ్రీష్మ ఇంట్లోనే ఉరేసుకుందని అత్తింటివారు చెబుతున్నారు. ఆమెను రామంతాపూర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని అంటున్నారు.
అత్త, మామ, భర్తనే గ్రీష్మకు ఉరేసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.