నేనూ.. హేమ సోదరిని గుర్తుపట్టలేదా?: మాయ లేడీ ఘరానా మోసం..
హైదరాబాద్: మాయ మాటలతో ఎదుటివాళ్లను బోల్తా కొట్టించడంలో వాళ్లు ధిట్ట. పైపెచ్చు.. ఇంతకుముందు పరిచయం ఉన్నవాళ్ల లాగే మాట్లాడుతారు. ఆ మాయలో పడి వెనుకా ముందు ఆలోచించకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. హైదరాబాద్ సనత్నగర్లో అమాయక మాటలతో మభ్య పెట్టి చోరీకి పాల్పడ్డ ఓ మహిళ బాగోతం వెలుగుచూసింది.
ఏం జరిగింది:
ఎర్రగడ్డ ఆనంద్నగర్లో నివసించే వెంకటేష్ ఈనెల 1న ఏదో పని నిమిత్తం బయటకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య లేకపోవడంతో.. ఇంటి తాళం పక్కింటివారికి ఇచ్చి హేమ వచ్చాక ఇవ్వాలని కోరాడు. కానీ ఇంతలోనే అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
హేమ సోదరిని అని నమ్మించి..:
వెంకటేశ్ 'కీ' ఇచ్చి వెళ్లిన ఐదు నిమిషాలకే అక్కడికో అమ్మాయి వచ్చింది. 'అమ్మా.. నేను హేమ చెల్లెలిని గుర్తుపట్టలేదా?' అంటూ పక్కింటివారిని పలకరించింది. 'ఇంతకుముందు ఒకసారి వచ్చి వెళ్లాను మరిచిపోయారా?.. ఇంటి తాళం మీకు ఇచ్చారట కదా, ఒకసారి ఇవ్వండి' అంటూ వాళ్లను మభ్యపెట్టింది.
నగలు, డబ్బుతో పరారీ:
ఆమె మాటలు విని నిజంగానే హేమ సోదరి కావచ్చునని పక్కింటివాళ్లు నమ్మారు. 'కీ' ఇవ్వగానే వెంకటేశ్ ఇంట్లోకి వెళ్లిన ఆమె.. 8 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు తన బ్యాగులో పెట్టేసుకుంది. ఆపై ఏమి తెలియనట్టు వచ్చి పక్కింటివారికి 'కీ' ఇచ్చేూసింది.
పట్టిస్తే.. క్యాష్ అవార్డు:
సాయంత్రం ఇంటికి వచ్చిన భార్యాభర్తలు వెంకటేశ్-హేమ.. ఇంట్లో డబ్బు, నగలు మాయం కావడాన్ని గుర్తించారు. వెంటనే సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటివారిని ఆరా తీయగా.. మాయ లేడీ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు.. నిందితురాలిని గుర్తించిన వారికి తగిన బహుమతి ఇస్తామని ప్రకటించారు.