ఇందిరకు ప్రశంస: కేసీఆర్ మాటలకు ఫక్కున నవ్విన మహిళలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని తన దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నరసన్న పేట గ్రామాల అభివృద్ధిపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ఈ రెండు గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయన్నారు. ఇరు గ్రామాల్లో 50 నుంచి 60 బోర్లు వేసుకోవాలని సూచించారు. సంపులకు బోర్లను అనుసంధానం చేసుకుందామన్నారు. ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయన్నారు. గ్రామస్థులు ఒకరికొకరు సహకరించుకుని అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
ఎర్రవల్లి, నర్సన్నపేటలో డ్రిప్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయన్నారు. మరో రెండేళ్లలో గోదావరి జలాలు వస్తాయిన్నారు. గోదావరి జలాలు వస్తే రాష్ట్రంలో నీటికి ఇబ్బంది ఉండదన్నారు. చెరువుల్లో నీరు చేరికతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఎక్కడికక్కడ స్థానిక వనరులను వినియోగించుకోవాలని సూచించారు.
మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో ఎక్కువ నీళ్లు చేరాయన్నారు. ముందుగా ఊహించినట్లుగానే ఈ సారి వర్షాలు బాగా పడ్డాయని, చెరువులు, కుంటల్లో నీళ్లు ఆపుకున్నామన్నారు. ఇలా చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశముందన్నారు.
అమ్మవారికి దండం పెట్టుకుందాం.. వర్షాలు పడుతాయని చెప్పినానని, భగవంతుని దయ వల్ల వర్షాలు పడ్డాయని అన్నారు. చాలా కాలం నుంచి ఎల్నినో ప్రభావం వల్ల కరువు సంభవించేందని చెప్పారు. కానీ ఇప్పుడు ఎల్నినో పీడవిరుగుడై, లానినో ప్రభావం ప్రారంభమైందన్నారు.
6 సంవత్సరాలు కానీ, 12 సంవత్సరాలు కానీ లానినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ఎల్నినో పోయి, లానినో పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో బ్రహ్మండమైన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలకు చెప్పారు. వ్యవసాయం కూడా ఓ పద్ధతి ప్రకారం చేసుకుంటా వెళ్లాలని సూచించారు.
ప్రతి ఇంటికీ కనీసం 10 చొప్పున కోళ్లు, పాడి బర్రెలను పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ గ్రామమైనా అంకాపూర్ అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్తుందన్నారు. షేడ్ నెట్స్ వేసుకుని కూరగాయాలు పండించుకోవాలన్నారు. దీంతో పాటు నర్సన్నపేటలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా గట్టిగా ఉండాలన్నారు. వాళ్లు ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగా చేస్తారని అన్నారు. ఆడవాళ్లను ఎప్పుడూ తక్కువ చేయకూడదని కోరారు. రష్యాలో ఒక ప్రాంతం ఉందని, అక్కడ 90 శాతం మహిళలే విమానాలు నడుపుతారని చెప్పడంతో సభలో ఉన్న మహిళలంతా ఫక్కున నవ్వారు.
దీంతో నవ్వడం కాదని, తాను చెప్పేది నిజమేనని తెలిపారు. అలాగే మన దేశంలో కూడా ఇందిరా గాంధీ దేశాన్ని అద్భుతంగా ఏలిందని ఆమెకు కితాబిచ్చారు. ప్రేమతో దేనినైనా సులభంగా జయించొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.