ట్విటర్ మారథాన్: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను ఇప్పటికైనా ప్రభుత్వం నియమిస్తుందా.?
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గతేడాది జరిగిన దిషా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశం మొత్తం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో మహిళా కమిషన్ అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పోస్టు గత 17 నెలలుగా ఖాళీగా ఉంది. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను నియమించాలని తెలంగాణ ప్రభుత్వంకు పలుమార్లు విన్నపాలు అందినప్పటికీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కొందరు మహిళలు బృందంగా ఏర్పడి "మహిళా కమిషన్ మ్యాటర్స్" అనే బ్యానర్ను ప్రదర్శించారు. అంతేకాదు వెంటనే మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను నియమించాలని కోరుతూ సీఎం కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ట్విటర్పై ఓ మారథాన్ను రన్ చేస్తున్నారు.
ఉమెన్ కమిషన్ మ్యాటర్స్ పేరుతో గ్రూపు
120 మంది మహిళలు ఉన్న ఈ బృందం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య తెలంగాణలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఉమెన్ కమిషన్ మ్యాటర్స్ పేరుతో గ్రూపును ప్రారంభించామని చెప్పారు ఈ గ్రూపు సభ్యురాలు ప్రశాంతి అన్నంరాజు. 10 మందితో ప్రారంభమైన ఈ బృందంలో ఇప్పుడు 120 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. తమ పర్సనల్ అకౌంట్స్ నుంచి అధికారులకు కానీ మంత్రులకు కానీ ఉమెన్ కమిషన్ ఛైర్పర్సన్ నియమించాలని కోరుతూ ట్వీట్ చేసేవారమని కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్వీట్ మారథాన్ ఐడియాతో ముందుకు వచ్చినట్లు ప్రశాంతి చెప్పారు. తాము చేసే ట్వీట్ మారథాన్తో అయినా ప్రభుత్వంలో చలనం వచ్చి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను నియమిస్తారేమో చూడాలన్నారు.
మహిళా కమిషన్ ఉంటే అదో ధైర్యం
మహిళల కోసం తెలంగాణ సర్కార్ పలు పథకాలు, ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పటికీ అవి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్లోటును పూడ్చలేవని చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఉండటం వల్ల మహిళలకు అన్యాయం జరిగితే న్యాయం జరుగుతుందన్న ఒక చిన్న ఆశ ఉంటుందని అన్నారు గ్రూపును ప్రారంభించిన స్ఫూర్తి కొలిపాక. అంతేకాదు విధానాలను అమలు చేయడంలో మహిళా కమిషన్ కీలకంగా వ్యవహరించడమే కాకుండా మహిళల రక్షణకు కాపలాగా నిలుస్తుందన్నారు. వారు చేయాల్సిన పనులు చట్టంలో స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.
చట్టం ఉంది కానీ మహిళా కమిషన్ ఎక్కడ..?
మహిళా కమిషన్ చట్టం మూడు దశాబ్దాల కిందే వచ్చినప్పటికీ ఈ రోజు తెలంగాణలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని డైనమిక్ మహిళా నేతను మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నియమించాలని స్ఫూర్తి కొలిపాక డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో అవసరమని చెప్పారు స్ఫూర్తి. మహిళా కమిషన్ ఉండటం వల్ల పోలీసులు, ఇతర శాఖలు మహిళల భద్రత కోసం పనిచేస్తాయని చెప్పారు.
మహిళా కమిషన్ వద్ద 150 కేసులకు పైగా పెండింగ్
ఇదిలా ఉంటే మహిళా కమిషన్ దగ్గర 150కి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ సమాచారం ఆర్టీఐ ద్వారా సేకరించామని చెప్పారు స్ఫూర్తి. గత ఆరేళ్లుగా వార్షిక నివేదిక కూడా లేదని ఆమె చెప్పారు. అంతకుముందు మహిళా కమిషన్ ఎలాంటి విధులు నిర్వర్తించిందనేదానిపై అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో చివరిసారిగా త్రిపురాణ వెంకట రత్నం మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా వ్యవహరించారు. జూలై 2018 తర్వాత తెలంగాణలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ లేరు.