మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే: ఇంటి ముందు మహిళల ధర్నా!..
సైనిక్పురి అమ్ముగుడా ప్రాంతంలో దాదాపు 15ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమకు ప్లాట్లను విక్రయించారని మహిళలు చెబుతున్నారు.
హైదరాబాద్: హబ్సిగూడలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు మహిళలు ఆందోళనకు దిగారు. గతంలో తమకు విక్రయించిన ప్లాట్లు లే అవుట్ వివాదంలో చిక్కుకోవడంతో.. సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.
వర్షంలోనే వాగ్వాదం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కలెక్టర్కు మధ్య కోల్డ్ వార్
సైనిక్పురి అమ్ముగుడా ప్రాంతంలో దాదాపు 15ఏళ్ల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమకు ప్లాట్లను విక్రయించారని మహిళలు చెబుతున్నారు. ఆ సమయంలో హుడా అనుమతులు ఉన్నాయని చెప్పడంతో.. తామంతా ప్లాట్లు కొనుగోలు చేశామన్నారు. వీరిలో చాలామంది మాజీ సైనికుల కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం.
లే అవుట్ అప్రూవల్ లేకపోవడంతో.. అధికారులు ఆ ప్రాంతంలో తమను ఇళ్లు కట్టుకోనివ్వడం లేదని, గత 15ఏళ్లుగా ఎన్నిసార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా.. ఆయన మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి.. ఇళ్లు కట్టుకోవడానికి హుడా అనుమతులు ఇచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.
కాగా, దాదాపు 13ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ ప్రారంభించిన ముత్తిరెడ్డి.. దాదాపు 130మందికి వాటిని విక్రయించారు. 2001లో వీటి విక్రయం జరిగిన తర్వాత.. ఇంటి నిర్మాణం కోసం 2004లొ పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ వాటిని తిరస్కరించడంతో.. అనుమతులు లేని విషయం నిజమేనని ముత్తిరెడ్డి కూడా ఒప్పుకున్నట్లు బాధితులు చెబుతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో.. బాధితులు కోర్టును ఆశ్రయించారు. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దీంతో కోర్టు బయట విషయాన్ని పరిష్కరించుకుందామని ముత్తిరెడ్డి బాధితులను నమ్మించాడు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ సంతకం పెట్టారని, ఇక పని అయిపోయినట్లేనని చెప్పుకొచ్చాడు.
అయితే ఆయన వ్యవహారమంతా మాటలకే పరిమితమవడంతో.. బాధితులంతా ధర్నా చేయడానికే నిర్ణయించుకున్నారు. గురువారం తెల్లవారుజామున 5.30గంటలకే హబ్సిగూడలో ఉన్న ముత్తిరెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. నాలుగు గంటల పాటు జరిగిన ధర్నాలో మహిళలే ముందు వరుసలో ఉన్నారు. వారిని అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.