మహిళా సాధికారతకు పట్టం... శ్రీనిధి తెలంగాణ పిండివంటలతో ప్రగతి పథం
బాగా చదువుకున్న మహిళలు ఉద్యోగాలు చేస్తారు. కాస్త తెలివైన మహిళలు వర్తక వ్యాపారాలు చేస్తారు. పెద్దగా చదువుకోక, వ్యాపారాలు చేసేంత తెలివిలేక, వంటింటికే పరిమితమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలు సైతం మహిళా సాధికారత సాధించే ప్రయత్నం చేశారు ఓ నలుగురు మహిళలు. గరిటె తిప్పగల ఆ చేతులతోనే ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయించారు. నలుగురు మహిళలతో శ్రీనిధి తెలంగాణ పిండి వంటల ప్రారంభం తెలంగాణ రుచులకు పట్టం కడుతూ దేశ విదేశాల వారికి పిండి వంటల రుచులను అందిస్తూ నేడు 50 మంది మహిళల మహిళా సాధికారతకు తోడ్పడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలచే నిర్వహించబడుతూ మరెంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు నేటి స్పెషల్.
గరిటె తిప్పే చేతులే అద్భుతాలు చేయగలవని నిరూపించిన శ్రీనిధి
మగువ ల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అని ముక్కుతిమ్మనార్యుడు పలికిన మాటలు అక్షర సత్యాలు. నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే మహిళలు నేర్చుకోలేని విద్య లేదు. కేవలం వంటింటికే పరిమితమైన, ఆర్ధిక అవసరాలతో సతమతమైన, చిన్నారుల చదువుల కోసం పడరాని పాట్లు పడిన మహిళలు తమకు తెలిసిన విద్యనే నమ్ముకున్నారు. పెద్దగా చదువుకోకపోవడం తో ఇబ్బంది పడిన మహిళలకు మీకు బాసటగా మేమున్నాం ముందుకు నడవమన్నారు ఈ నలుగురు మహిళలు . శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు స్థాపించి మీ పాక ప్రావీణ్యాన్ని చూపించండి అంటూ మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇక పిండి వంటలు చేయడంలోనూ నేర్పరితనం లేని మహిళలకు తర్ఫీదును కూడా ఇచ్చారు. మొదట నలుగురుగా ప్రారంభించబడిన శ్రీనిధి పిండి వంటలు ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పల్లె రుచులు కు పట్టం కడుతూ దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ రుచులను అందిస్తోంది.
శ్రీనిధి పిండివంటలు స్థాపించాలనే ఆలోచన కు కారణం.. మహిళలకు ఉపాధి కల్పించడం
ఇంట్లో ఊరికే తిని కూర్చుంటే ఏమొస్తుంది. 10 మంది మహిళలకు ఉపాధి కల్పించగలిగితే కనీసం సంతోషమైనా వస్తుంది. ఏదో ఒక పని చేస్తున్న ఆనందం కలుగుతుంది అని భావించారు నలుగురు మహిళలు. అలా ప్రారంభించబడింది శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వర్రావు, రాధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రమ, ఉమ, ఉష, కుమారుడు భీంరావ్ ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. చిన్నతనంలో తల్లి చేసిన వంటలను ఆస్వాదించిన కుమార్తెలు నేటి తరానికి బేకరీ, ఫాస్ట్ఫుడ్కు దీటుగా సంప్రదాయ తెలంగాణ పిండి వంటకాలను పరిచయాలని నిర్ణయించుకున్నారు.
అమ్మ స్ఫూర్తితో ఈ సంస్థను ప్రారంభించారు. అలా ప్రారంభించిన సంస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. బేకరీ, ఫాస్ట్ఫుడ్లకు దీటుగా పిండి వంటలను తెలంగాణా ప్రజలకు అందిస్తున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు, మరదలు అర్చన(తమ్ముడి భార్య) కలిసి 2016 మే 2న 'శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు' ను ప్రారంభించారు. ప్రస్తుతం 50 మంది మహిళలకు ఉపాధి కల్పించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు.ప్రతిరోజు సుమారు 60 నుండి 100 మందికి పైగా కస్టమర్లు వీరు తయారు చేసిన పిండి వంటలను కొనుగోలు చేస్తున్నారు. ఇక విదేశాలకు సైతం ఈ పిండి వంటలు ఎగుమతి అవుతున్నాయి.
సెక్రటేరియట్లో మళ్లీ ఫైర్ యాక్సిడెంట్.. వరుస అగ్ని ప్రమాదాలకు కారణమేంటో?
తెలంగాణ రుచులకు పట్టం కడుతూ దేశ విదేశాల వారిని ఫిదా చేస్తున్న శ్రీనిధి
నాణ్యత, రుచి కి పట్టం కడుతూ వీరు తయారు చేసే పిండి వంటలు కొనుగోలు చేయడానికి ఇతర ప్రాంతాల నుండి పెద్దఎత్తున ప్రజలు వస్తారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు కరకరాలడే కారప్పూస, నోరూరించే సకినాలు, గారెలు, తియతీయని అరిసెలు ఇలా ఒక్కటేమిటి మరెన్నో రకాల అసలు సిసలైన తెలంగాణ పిండి వంటకాలను నేటి తరానికి అందిస్తున్నారు. వరంగల్తో పాటు దేశంలోని ప్రధాన నగరాలు, ఇతర దేశాలకు వీరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. నలుగురు మహిళలతో మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 50 మంది ఉపాధి పొందుతున్నారు.
శ్రీనిధి పిండివంటలు ఇచ్చిన ఆర్థిక స్వావలంబన తో మహిళల్లో ఆత్మవిశ్వాసం
శ్రీనిధి తెలంగాణ పిండివంటల్లో పని చేయక ముందు ఎన్నో ఇబ్బందులు పడిన మహిళలు, ఎన్నో బాధలు అనుభవించిన మహిళలు ఇప్పుడు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ తమ సమస్యను తాము పరిష్కరించుకుంటాం అన్న ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తున్నారు. చదువు లేకున్నా, మాకు తెలిసిన విద్యతోనే మా జీవితాలను చక్కదిద్దుకుందామనే నమ్మకాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుత 50 మంది మహిళలు పనిచేస్తున్న ఈ సంస్థలో మరింత మంది మహిళలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ఈ సంస్థను నిర్వహిస్తున్న నలుగురు మహిళలు. ఇంత మంది జీవితాల్లో పిండి వంటల ద్వారా వెలుగులు నింపిన ఈ నలుగురు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు సగర్వంగా సెల్యూట్ చేస్తుంది మహిళా లోకం . చదువుతో సంబంధం లేకుండా, పెద్దగా తెలివితేటలతోనూ పని లేకుండా గరిటె తిప్పగల సామర్థ్యాన్ని ఉపయోగించి ఆర్థిక స్వావలంబన సాధించి, ప్రగతి పధం లో మహిళల నడిచేలా చేస్తున్న ఈ మహిళలు నిజంగా స్ఫూర్తి ప్రదాతలు. నిజమైన మహిళా జీవన సౌందర్యానికి ప్రతీకలు.