ఇక రాచకొండ పరిదిలో మహిళల సేఫ్ జర్నీ..! చేయాల్సిందల్లా ఆ ఒక్కటే...!!
హైదరాబాద్: మహిళా భద్రత కోసం రాచకొండ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరో అడుగు ముందుకు వేశారు. ప్రయాణంలో మహిళలు ఏ సమయంలోనైనా అభద్రతా భావం లేకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు వారికి రక్షణ కవచాలను సిద్ధం చేశారు. జస్ట్ వాటిని స్మార్ట్ఫోన్లో స్కాన్ చేస్తే చాలు... వారు ప్రయాణించే వాహనం నిత్యం పోలీసుల కన్నుసన్నుల్లో సాగుతుంది. ఇప్పటి వరకు క్యాబ్లకు పరిమితమైన ఈ అంశం... ఇప్పుడు ఆటోలకు కూడా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు అనుసంధానం చేశారు. ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉన్న క్యాబ్, ఆటోల్లో ఎటువంటి చింత లేకుండా మహిళలు, యువతులు, ప్రయాణికు లు సురక్షితంగా ప్రయాణించవచ్చు. అలాగే ఆటోల్లో ఎదైనా వస్తువు మర్చిపోయినా ఈ స్టిక్కర్ స్కానింగ్ ద్వారా ఆటోను గుర్తించి వెంటనే మర్చిపోయిన వస్తువులను తిరిగి పొందవచ్చు.
మహిళా భద్రత కోసం రాచకొండ పోలీసులు వినూత్న అడుగులు..! ఆటోలకు సేఫ్ స్టిక్కర్లు..!!
మహిళా భద్రత కోసం ప్రవేశపెట్టిన మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఆటోలకు ఆయన మై వెహికిల్ ఈజ్ సేఫ్ స్టిక్కర్ను పంపిణీ చేశారు. స్టిక్కర్లను అంటించుకున్న ఆటోలను సీపీ మహేశ్ భగవత్, మహిళ పోలీస్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ డీసీపీ ఎన్.దివ్యచరణ్రావు, అదనపు డీసీపీ తాజుద్దీన్ అహ్మాద్, మనోహర్, షీ టీమ్స్ ఇన్చార్జి సలీమా, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్.. మై వెహికిల్ ఈజ్ సేఫ్ కార్యక్రమంతో ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఆటోకు సంబంధించిన సమాచారం డిజిటలైజేషన్ అవుతుంది.
సేఫ్ స్టిక్కర్లలో ఆటో వివరాలు..! ఆటో ఎక్కిన వెంటనే స్నాన్ చేస్తే సరి..!!
సేఫ్ గాడీ.కామ్ సంస్థ సహకారంతో మై ఆటో ఈజ్ సేఫ్ స్టిక్కర్ను రూపొందించారు. ఈ స్టిక్కర్ను రిజిస్టర్ ఆటోకు కేటాయించిన నంబర్తో క్యూర్ కోడ్ ఉంటుంది. ప్రయాణికులు ఈ స్టిక్కర్ ఉన్న ఆటోను ఎక్కాలి. తమ స్మార్ట్ ఫోన్ ద్వారా స్టిక్కర్పైన ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి వివరాలను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తెలిసిన వారికి పంపించుకోవాలి. దీంతో ప్రయాణికురాలు ఏ నంబర్ గల ఆటోలో ప్రయాణిస్తుంది... ఆ ఆటోడ్రైవర్ ఫోన్ నంబర్, పేరు, చిరునామా ఇతర వివరాలన్నీ తెలిసిపోతాయి. ఏదైనా తేడా అనిపించినా, అనుమానం వచ్చినా... ఆ వివరాలను డయల్ 100, హాక్ఐ, పోలీస్ వాట్సాప్(రాచకొండ వాట్సాప్ నెం.9490617111)కు పంపించవచ్చు.
స్నాన్ వివరాలు షేర్ చేయొచ్చు..! వెంటనే ఆటో ఎటు వెళ్తుందో తెలిసిపోతుంది..!
వెంటనే పోలీసులు ఆ సమాచారం ద్వారా ఆటోను ట్రాకింగ్ చేసి పట్టుకుంటారు. ఇది ఇలా ఉండగా... ఆటోలో ప్రయాణించే సమయంలో అందులో విలువైన వస్తువులను మర్చిపోతే వెంటనే www.safeautotaxi.com లేదా www.safegaadi.com వెబ్సైట్లో సమాచారం ఇస్తే... లైవ్ ట్రాకింగ్లో వారు వెంటనే ఆటో తిరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి... మీరు మర్చిపోయిన వస్తువులను పొందేందుకు సహాయపడతారని ట్రాఫిక్ అధికారులు వివరించారు. ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను పొందేందుకు వచ్చిన ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు.
మహిళలకు ఎంతో అవసరం..! నేరాలు అదుపులో ఉంటాయంటున్న పోలీసులు..!!
ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాచకొండ పోలీసుల వద్ద 2 వేల మంది ఆటోవాలలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 600 మందికి మై ఆటో ఈజ్ సేఫ్ స్టిక్కర్ను అందించారు. త్వరలో ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్లో తిరిగి ప్రతి ఆటోకు ఈ స్టిక్కర్ ఉండేలా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి... ఈ స్టిక్కర్లు పొందారా లేదా అనే విషయాన్ని గుర్తిస్తారు. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో తిరుగుతున్న దాదాపు 22వేల క్యాబ్లకు మై వెహికిల్ ఈజ్ సేఫ్ స్టిక్కర్లను అందించినట్లు పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కావునా మహిళలు, యువతులు, ఇతర ప్రయాణికులు ప్రయాణించే సమయంలో ఆటోలు, క్యాబ్లకు ఈ స్టిక్కర్లు ఉన్నాయా? లేవా? పరిశీలించుకుని వాటిలో ప్రయాణిస్తే.. మీ ప్రయాణం సురక్షితమని ఆయన భరోసా ఇచ్చారు.