150మందిలో 79మంది మహిళలే: గ్రేటర్లోను కెసిఆర్ చేయి! కవిత స్పందించేనా?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచిన అనంతరం మేయర్గా చర్లపల్లి డివిజన్ నుంచి గెలిచిన బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ అయ్యారు. ఇప్పటికే కెసిఆర్ కేబినెట్లో మహిళలకు చోటు లేకుండా పోయిందని, గ్రేటర్ ద్వారా మరోసారి చోటు దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అటు రాష్ట్ర మంత్రివర్గంలో, ఇటు జిహెచ్ఎంసి ఎన్నికల్లో మహిళలకు పదవులు లేవని అంటున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 మంది కార్పోరేటర్లు గెలిస్తే.. 79 మంది మహిళలే కావడం గమనార్హం.
గ్రేటర్ మేయర్ ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యులు కె కేశవ రావు కూతురు విజయలక్ష్మి పేరు ప్రధానంగా వినిపించింది. ఆమెతో పాటు పిజెఆర్ కూతురు విజయ పేరు కూడా డిప్యూటీ మేయర్ పదవి రేసులో కొద్దిగా వినిపించింది. అయితే, మేయర్గా లేదా డిప్యూటీ మేయర్గా మహిళళకు అవకాశం రాలేదు.
గత ఏడాది ఓ సందర్భంలో కెసిఆర్ కూతురు, ఎంపీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు గ్రేటర్ పదవులలోను మహిళలకు చోటు దక్కకపోవడంపై కవిత మళ్లీ స్పందిస్తారా అనే చర్చ సాగుతోంది.
కేబినెట్లో మహిళలకు చోటు దక్కలేదు. అయితే, పద్మా దేవేందర్ రెడ్డి మాత్రం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అంతకుమించి మహిళలకు అవకాశం రాలేదు. కెసిఆర్ కేబినెట్లో మహిళలకు చోటు దక్కకపోవడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు గ్రేటర్లోను దక్కకపోవడంపై ఏమంటారో చూడాలి. కాగా, ఇటీవల కేబినెట్లో మహిళలు లేకపోవడంపై కెసిఆర్ ఓ ప్రశ్నకు సమాధానంగా... అలా అని రాజ్యాంగంలో ఉందా అన్నారు.