కొండా సురేఖ చెప్పిన విచిత్రమైన లాజిక్..! అందుకే ఆ మంత్రి ఓడిపోడట..!!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఎంత సంచలనం స్రుష్టించాయో ఓడిన, గెలిచిన అభ్యర్థుల పట్ల అంతే సంచలన విశ్లేషణను బహిర్గతం చేస్తున్నారు రాజకీయ నేతలు. తెలంగాణ అదికార, ప్రతిపక్ష అభ్యర్థులు ఎందుకు ఓటమి పాలయ్యారో చిత్రమైన కారణాలు వినిపిస్తున్నారు నేతలు. తాజాగా కొండా సురేఖ వరంగల్ లో ఎర్రబెల్లి దయాకర్ ఎందుకు గెలిచారో, అలాగే జూపల్లి క్రిష్ణారావు కొల్లాపూర్ లో ఎందుకు ఓడిపోయారో కారణం చెప్పి ఔరా అనిపించారు. ఆమె భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి తన పదవికి రాజీనామా సమర్పణ సందర్బంగా శాసన మండలికి వచ్చిన కొండా సురేఖ గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములు పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అదికార గులాబీ పార్టీలో ఓడిన అభ్యర్థుల వెనక పెద్ద ప్రహసనం దాగుందని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఒక అభ్యర్ధికి క్యాబినెట్ ర్యాంక్ కట్టబెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రిని అదికార పార్టీ పెద్దలే ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అదికార పార్టి తనకు నచ్చిన అభ్యర్థులను అందలం ఎక్కించడం, నచ్చక పోతే అదఃపాతాళానికి తొక్కేకయడం అలవాటుగా మార్చకుందని అన్నారు. ఇదే క్రమంలో మంత్రి జూపల్లి క్రిష్ణారావును గులాబీ పార్టీ శ్రేణులే ఓడించాయని చెప్పుకొచ్చారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి కట్టబెట్టేందుకే అదికార పార్టీ పెద్దలు ఇలా చేసారని చెప్పుకొచ్చారు సురేఖ. అంటే పార్టీలో ఎలాంటి ఇంటి పోరు లేకుండా ముందస్తు జాగ్రత్తలతో, ఎవరికి అంతుచిక్కని వ్యూహాలతో ముందుకెళ్తుందని సురేఖ వ్యాఖ్యలు చెప్పకనే చెప్తున్నట్టు చర్చ జరుగుతోంది.