కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక .. ప్రతి పది మందిలో ఒకరికి కరోనా
కరోనా వైరస్ మహమ్మారి గత పది నెలలుగా ప్రపంచాన్ని గజాగజా వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడున్నర కోట్ల మందికి పైగా ఈ వైరస్ సోకి అనారోగ్యం బారిన పడ్డారు. ఇక లక్షల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ వల్ల మరణించారు. ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమావేశాలలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరికి కరోనా వైరస్ సంక్రమించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్వో అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత ప్రధాని మోడీని ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ... రీజన్ ఇదే !!
అధికారిక లెక్కలకు వాస్తవానికి చాలా తేడా ఉందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయం
ప్రపంచంలోనే ఎక్కువ భాగం కరోనా కారణంగా ప్రమాదంలో ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. కరోనా వైరస్ బారిన పడినట్లుగా కేవలం 35 మిలియన్ల మందిని అధికారికంగా ధ్రువీకరించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు ఒక అంచనా ప్రకారం ఆ సంఖ్య ఎనిమిది వందల మిలియన్ల మేర ఉంటుందని పేర్కొన్నారు.
కేసుల వాస్తవ సంఖ్య ధృవీకరించబడిన కేసులను మించిపోతుందని, అధికారిక లెక్కల కు వాస్తవ లెక్కలకు చాలా తేడా ఉందని నిపుణులు చాలాకాలంగా అని చెబుతున్నారు.
ప్రపంచ జనాభాలో 10 శాతం మందికి కరోనా
కరోనా మహమ్మారి గురించి ప్రపంచ దేశాల పరిస్థితి పై చర్చించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ప్రధాన కార్యాలయంలో సమావేశం అయింది . అనేక దేశాలు ఆంక్షలను సడలించిన తర్వాత సెకండ్ వేవ్ కూడా వస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేసుల సంఖ్య మరింత గణనీయంగా పెరిగింది. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది వైరస్ బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి ఇది దేశాన్ని బట్టి మారుతుందని, పట్టణాలకు గ్రామాలకు తేడా ఉంటుందని, ఇది పెద్ద సమూహాల మధ్య కూడా మారుతూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మరింత డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాం అంటున్న డబ్ల్యూహెచ్వో
ప్రపంచంలో చాలాభాగం ఇప్పుడు కరోనా కారణంగా ప్రమాదంలో ఉందని, మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉందని, ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నియంత్రించడం కోసం, ప్రజలను కాపాడడం కోసం అన్ని దేశాల పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం సంక్లిష్టమైన కాలంలోకి వెళ్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాలలో కొన్ని ప్రాంతాలలో కరోనా వ్యాప్తి బాగా జరుగుతుందని, యూరప్ తో పాటుగా ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది
.