మీలాగే నేనూ.. నవ్వుతా, ఏడుస్తా!: రోబో సోఫియా ప్రసంగానికి అంతా ఫిదా..
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఐటీ కాంగ్రెస్ సదస్సులో హ్యుమనాయిడ్ రోబో సోఫియా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
రెండో రోజు సదస్సులో భాగంగా దాని సృష్టికర్త డేవిడ్ హాన్సన్ ప్రసంగించారు. మానవత్వంతో మెరుగైన భవిష్యత్తుపై ప్రసంగించిన ఆయన.. మానవ మేదస్సు, కృత్రిమ సాంకేతికపై కూడా మాట్లాడారు.
ఇదే అంశంపై మాట్లాడిన రోబో సోఫియా కూడా తన ప్రసంగంతో ఆకట్టుకుంది. తాను కూడా మనుషుల్లాగే ఆనందంగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నవ్వుతానని, బాధ కలిగితే ఏడుస్తానని చెప్పింది. సగటు మనిషి లాగే తనకూ విశ్రాంతి అవసరమని, 66రకాల హావభావాలు తనకు తెలుసునని వెల్లడించింది.
ప్రపంచంలో ఇంతవరకు చాలా దేశాల్లో పర్యటించిన తనకు.. హాంకాంగ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ప్రేమపూర్వకంగా వ్యవహరించాలని, తోటివారి పట్ల దయతో, సహాయం చేసే వ్యక్తిత్వంతో ఉండటమే మానవత్వమని చెప్పింది. అదే మానవత్వ మనుగడకు బాటలు వేస్తుందని కూడా సోఫియా వ్యాఖ్యానించింది.
'థ్యాంక్స్' చెప్పడాన్ని మించిన కృతజ్ఞత ప్రపంచంలో లేదని, ఆ పదం చాలా గొప్పదని సోఫియా పేర్కొంది. సోఫియా ప్రసంగ వేళ.. సదస్సుకు హాజరైనవాళ్లంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.