ప్రపంచ తెలుగు మహాసభలు: కోదండరామ్ దాడి, సిధారెడ్డి ఎదురుదాడి
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు ఇద్దరు పాత మిత్రుల మధ్య చిచ్చు పెట్టింది. ప్రపంచ మహాసభల తీరును తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తప్పు పట్టగా, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తీవ్రంగా ఎదురుదాడి చేశారు.
Recommended Video
ప్రపంచ తెలుగు మహాసభలు అనుకున్నంత గొప్పగా జరగలేదని కోదండరామ్ విమర్శించారు. కొందరిని మహాసభలకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. దానికి నందిని సిధారెడ్డి తీవ్రంగా స్పందించారు.
అంత మాత్రానికి సభలు ఎందుకు...
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదాన్ని కాపాడుకునేందుకు గతంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారని, తెలంగాణ యాస, భాష అస్తిత్వం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందని కోదండరామ్ గుర్తు చేస్తూ స్వంత రాష్ట్రం వచ్చిన తర్వాత యాసని కాపాడుకోవడానికి ప్రపంచ తెలుగు మహాసభలు జరగాల్సిందని, ఆ ప్రయత్నమే జరగలేదని, మరోసారి సాహితీవేత్తలతో సమావేశమైన కార్యచారణ రూపొందిస్తామని ముగింపు సభలో చెప్పారని, అంత మాత్రానికి సభలు నిర్వహించడం ఎందుకని కోదండరామ్ అన్నారు.
వారిని ఎందుకు పిలువలేదని కోదండరామ్
తెలంగాణ యాస, భాష అస్తిత్వాన్ని కాపాడడంలో ముందువరుసలో ఉన్నవారిలో చాలా మంందికి మహాసభల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించలేదని కోదండరామ్ విమర్శించారు. గద్దర్, విమలక్క, అందెశ్రీ, మిత్రలాంటి వాళ్లని ఆహ్వానించలేదని, విరసం సభ్యులను అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
కోదండరామ్ రాజకీయశాస్త్రం చదివారు..
కోదండరామ్ రాజకీయ శాస్త్రం చదివారని, రాజకీయ శాస్త్రంలో నుంచి చూస్తే సాహిత్యం కనిపించదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సికింద్రాబాదులోని మారేడ్పల్లిలో ఏర్పాటు చేసిన ఈగ బుచ్చిదాసు తోరణం గురించి కోదండరామ్కు తెలుసా? అని ప్రశ్నించారు.
ఆయన సంకీర్తనలు రాశారు..
యాదగిరి లక్ష్మీనర్సింహస్వామిపై బుచ్చిదాసు అద్భుతమైన సంకీర్తనలు రాశారని, ఆ సంకీర్తనలను తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిందని సిధారెడ్డి గురువారం మీడియా సమావేశంలో అన్నారు. మహాసభల సందర్భంగా 6 వేల తెలంగాణ సామెతలు ముద్రించామని, ఇవన్నీ సమైక్య సామెతలేనా అని ప్రశ్నించారు.
సొరకాయ సభలా, ఆనగపు కాయ సభలా...
ప్రపంచ తెలుగు మహాసభలు సొరకాయ సభలా, అనిగపు కాయ సభలా అన్నప్పుడు కూడా చెప్పామని, ఆ ప్రాంతపు అన్నమాచార్యతో సమానంగా ఈ ప్రాంతపు ఈగ బుచ్చిదాసును, భక్త రామదాసును చూడాలనే సమదర్శనంతో నిర్వహించిన సభలు ఇవి అని ఆయన అన్నారు. ముందు కోదండరామ్ ఈ ప్రాంతం సాహిత్యం గురించి చదివి, తెలుసుకుని మాట్లాడితే ఆరోగ్యంగా ఉంటుందని సిధారెడ్డి అన్నారు.
ఒల్లెడ పట్టుకుని ఇలా...
బాలకిషన్ నాయకత్వంలో ఒల్లెడ పట్టుకుని తెలంగాణ పెళ్లి ఊరేగింపు జరిగిందని, పోచమ్మ దేవత దగ్గరకు వెళ్లేటప్పుడు ఒల్లెడ పట్టుకుని పొయ్యే దృశ్యాన్ని ఎక్కడైనా చూశారా? గతంలో ఎన్నడైనా ఇలాంటి ప్రదర్శనలు చేశారా?' అని సిధారెడ్డి అన్నారు. సినీ సంగీత విభావరిలో కొంత మంది తెలంగాణ కళాకారులను విస్మరించిన మాట వాస్తవమేనని, ప్రేమ్రాజ్ లాంటి దర్శకుడిని వేదికపై పిలవాల్సి ఉండిందని. దాన్ని సరిదిద్దుకుంటామని అన్నారు.