విషాదం... ఉద్యోగం నుంచి తొలగించడంతో టెక్కీ ఆత్మహత్య... కుప్పకూలిన తల్లిదండ్రులు..
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న మనస్తాపంతో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంగళవారం(సెప్టెంబర్ 22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే... భువనగిరి పట్టణానికి చెందిన అభిలాష్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి వర్క్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కంపెనీ నుంచి అభిలాష్కి ఓ సమాచారం అందింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇదే క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లోనే తన చేతి మణికట్టును కత్తితో కోసుకుని... ఆపై సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్కు వేలాడుతున్న కొడుకును చూసి అభిలాష్ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చేతికి అందివచ్చాడనుకుంటున్న తరుణంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఇలా అన్యాయం చేసి వెళ్లిపోయావా అని రోధిస్తున్నారు. కొడుకు ఆత్మహత్యతో షాక్ తిన్న అభిలాష్ తల్లి స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ దంపతులను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది.
మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అభిలాష్ మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అభిలాష్ను జాబ్ నుంచి తొలగించడంపై ఆ కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించి వివరాలు కోరే అవకాశం ఉంది.
Recommended Video
కరోనా లాక్ డౌన్ చాలా రంగాలపై ప్రభావం చూపించడంతో ఎంతోమంది ఉద్యోగ,ఉపాధి కోల్పోయిన పరిస్థితి. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో కేరళకు చెందిన జీనమోల్ జోసెఫ్(25) అనే యువ ఐటీ ఉద్యోగి కూడా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం పోయినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు,వలస కూలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నది.