లిస్ట్లో పేరు లేదు: ఓటేసేందుకు విదేశాల నుంచి వస్తే అపోలో చీఫ్ కూతురుకు షాక్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం (ఏప్రిల్ 11) ప్రారంభమైంది. ఏపీలోని 25 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా పద్దెనిమిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏమైందో తెలియాలి: ఓటేసిన పవన్ కళ్యాణ్, ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్ట్! ఏం జరిగిందంటే?
ఓటరు జాబితాలో లేని అపోలో చీఫ్ కూతురి పేరు
ఎంతోమంది ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్నారు. అయితే అపోలో ఆసుపత్రి చీఫ్ కూతురు శోభన కామినేని కూడా ఓటు వేసేందుకు హైదరాబాదులోని పోలింగ్ బూత్కు వెళ్లారు. కానీ ఆమె పేరు ఓటరు జాబితాలో లేదు. దీంతో ఆమె షాకయ్యారు. బూత్కు వెళ్లి చెక్ చేస్తే తన పేరు లేదని, తొలగించినట్లుగా తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఓ భారతీయురాలిగా ఇది తనకు చాలా దురదృష్టకరమైన రోజు అని శోభన కామినేని అన్నారు. ఇక్కడ ఓ ముఖ్యమైన అంశం ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఓటు వేసేందుకే ఆమె విదేశాల నుంచి రావడం ఇక్కడ గమనార్హం. ఆమె ఫారెన్ టూర్కు వెళ్లారు. కానీ ఓటు వేయాలని ముందే తిరిగి వచ్చారు.
నా ఓటు ముఖ్యం కాదు.. వదిలి పెట్టను
తనకు ఓటు లేకపోవడంపై శోభన కామినేని మీడియాతో మాట్లాడారు. నేను ఓటు వేసేందుకు బూత్కు వెళ్లానని, కానీ నా పేరు లేదని అధికారులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశానని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం తన ఓటు లేదన్నారు. అసలు తనను భారతీయురాలిగా చూడటం లేదా, నా ఓటు ముఖ్యమైనది కాదా, ఓ భారతీయురాలిగా తన ఓటు డిలీట్ చేయడం తీవ్రమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిని తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
చేవెళ్ల ఎంపీ కోడలు.. శోభన కామినేని
శోభన కామినేని.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూతురు. అలాగే, చేవెళ్ల లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి కోడలు. కొండా విశ్వేశ్వర రెడ్డి 2014లో చేవెళ్ల నుంచి పోటీ చేసి గెలిచారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.