జగన్ని వదిలి తెరాసలో చేరిన మూర్ఖుడ్ని: ఎమ్మెల్యే
ఖమ్మం: వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మూర్ఖుడిని తాను అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వైరాలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరులు, తెరాసకు చెందిన మరో నేత వర్గానికి చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.
తాను అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెరాసలో చేరానన్నారు. తెలంగాణలో జగన్ నేతృత్వంలోని వైసీపీకి మనుగడ ఉండదని భావించి ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసినంత కాలం ఏనాడు అబాసుపాలు కాలేదన్నారు.
వైసీపీని వదిలి తెరాసలో చేరిన తొలి మూర్ఖుడిని తానేనని వ్యాఖ్యానించారు. నలుగురిని వెంట వేసుకొని వచ్చి విమర్శలు చేయవద్దన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసి తప్పు చేస్తే తాను బహిరంగ క్షమాపణ అడుగుతానని చెప్పారు. అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొని వందల పుస్తకాలు తీసుకొస్తానని చెప్పారు.
తాను తెరాసలోకి రాకముందు ఒక్క వార్డు సభ్యుడు కూడా తెరాసలో లేరని, తాను తెరాసలో చేరిన తర్వాత వందలాదిమంది చేరుతున్నారన్నారు. అయితే, ఆయన తెరాసలో చేరినందుకు కాకుండా.. స్థానిక నేతల విభేదాల కారణంగానే వ్యాఖ్యానించారని చెప్పవచ్చు.