90కి చేరిన టీఆర్ఎస్ బలం, కేటీఆర్ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) కొలువు దీరనుంది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు గాను తెరాస 88 స్థానాల్లో గెలిచింది. పార్టీ గెలిచిన మరుసటి రోజు... ప్రభుత్వం ఏర్పడటానికి ముందు రోజే తెరాస బలం 90కి చేరుకుంది.
బుధవారం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, తాము తెరాసలో చేరుతామని చెబుతున్నారని అన్నారు. ఓడిపోయిన వారు, గెలిచిన వారు అని లేకుండా అందరూ తమకు అవసరమేనని చెప్పారు. త్వరలో పలువురు నేతలు తమ పార్టీలో చేరుతారని అన్నారు. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేరకపోయినప్పటికీ.. స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు ఇద్దరి చేరారు.
కేటీఆర్ను కలిసిన కే చందర్
రామగుండం నుంచి ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసి విజేతగా నిలిచిన కోరుకంటి చందర్ బుధవారం కేటీ రామారావును కలిశారు. టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు వరకు తెరాసలోనే తాను ఉన్నానని, కేసీఆర్ నాయకత్వంలో భవిష్యత్తులో పని చేస్తానని చెప్పారు. కాగా, మంగళవారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై కే చందర్ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో చందర్కు 61,400 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 34,981 ఓట్లు వచ్చాయి.
రామగుండం నుంచి భారీ మెజార్టీ
కోరుకంటి చందర్ రామగుండం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా చందర్కు 61,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ ఠాకూర్కు 26,614 ఓట్లు, ఎఫ్ఎఫ్బీ అభ్యర్థి మారం వెంకటేశ్కు 3,485 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్తో మంతనాలు జరిపిన చందర్.. టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
వైరా రాములు నాయక్
బుధవారం సాయంత్రం వైరా నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ కూడా కేటీ రామారావును కలిశారు. కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. వైరాలో ఆయనకు 52,650 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కూడా రాములు నాయక్ గెలిచాడు. ఇప్పుడు రాములు నాయక్తో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కేటీఆర్ను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పినప్పటికీ తెరాసకు మద్దతిస్తున్నట్లే లెక్క. దీంతో తెరాస బలం 90కి చేరింది.
88 స్థానాల్లో గెలుపు
మంగళవారం వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. తెరాస దెబ్బకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో ఏర్పాటైన ప్రజాకూటమి 21 స్థానాలకే పరిమితమైంది. మజ్లిస్ ఏడు, బీజేపీ ఒకటి, స్వతంత్రులు రెండు స్థానాల్లోనే గెలిచారు.